అందని ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు
అప్పు తెచ్చి నిర్మాణ పనులు..పెరుగుతున్న వడ్డీలు
రెండు నెలలైన విడుదల కానీ చివరి దశ బిల్లు
బిల్లు కోసం లబ్దిదారుల ఎదురు చూపులు
కాకతీయ,మంగపేట : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయినా, చివరి దశ బిల్లుల కోసం లబ్ధిదారులు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. నిర్మాణం పూర్తయి గృహప్రవేశం చేసినా, చివరి విడత డబ్బులు సకాలంలో రాకపోవడంతో అప్పులు చేసిన లబ్ధిదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం 4 విడతల్లో ఇళ్ల లబ్దిదారులకు రూ. 5 లక్షలు ఇస్తున్నారు. బేస్ మెంట్ పూర్తయితై రూ, లక్ష, రూఫ్ లెవల్ రూ, లక్ష,స్లాబ్ వేశాక రూ, 1.40 లక్షల బిల్లులు ఇస్తుండగా మండలంలో 25 గ్రామ పంచాయతీలలో మొత్తం 626 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవగా 554 ఇళ్లు నిర్మాణ దశలో ఉండగా ఫైనల్ స్టేజ్ లో 72 ఇళ్లు నిర్మాణం పూర్తి చేయగా కొంతమంది లబ్దిదారులు గృహప్రవేశాలు చేశారు.అప్పులు తెచ్చి నిర్మాణ పనులు పూర్తి చేయగా చివరి బిల్లు రాక తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని రెండో నెలలు గడుస్తున్నా నేటికీ చివరి దశ బిల్లు రాక అప్పు తెచ్చి నిర్మాణం పూర్తి చేశామని చివరి బిల్లు రాక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు లబ్దిదారులు తెలిపారు.
చివరి దశ చెల్లింపులో జాప్యం..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మొదటి, రెండు, మూడు దశల్లో బిల్లులు వెంట వెంటనే మంజూరు అవుతున్నా చివరి దశ బిల్లు చెల్లింపు మంత్రం జాప్యం జరుగుతుంది.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా చివరి దశ బిల్లు చెల్లింపులో ఎందుకు ఎందుకు జాప్యం జరుగుతుందో అధికారులు కూడా సరైన సమాధానం చెప్పలేక పోతున్నారని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు సాంకేతిక సమస్యలు పరిష్కరిస్తూ చివరి దశ బిల్లు వేగంగా వచ్చేలా చూడాలని లబ్దిదారులు కోరుతున్నారు.ఈ విషయం పై మండల గృహ నిర్మాణ శాఖ ఏ.ఈ. మనస్విని వివరణ కోరగా పీఎం అవాస్ యోజన సర్వే ఇతర మండలాల్లో పూర్తి కానందున సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఆగాయని సర్వే పూర్తి అవగానే ఏప్రిల్ నెలలో చివరి దశ బిల్లు జమ అవుతాయని చెప్పారు.


