కరీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై విజిలెన్స్ దాడులు
రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు
కార్యాలయం అష్టదిగ్బంధనం.. అక్రమాల గుర్తింపు..?!
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. తనిఖీల సందర్భంగా కార్యాలయంలోని పలు విభాగాలకు సంబంధించిన రికార్డులను అధికారులు సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత, పత్రాల నిర్వహణలో నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అధికారుల బృందం కార్యాలయంలోని పత్రాలు, నమోదు విధానాలు, ఫీజుల లావాదేవీలపై వివరాలు సేకరిస్తోంది. ఏమైనా క్రమాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ దాడులు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.



ముందే చెప్పిన కాకతీయ..!
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు జరిగే అవకాశం ఉందన్న విషయం ఈనెల 13న కాకతీయ సమగ్రమైన కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. కాకతీయలో ప్రచురితమైన కథనం ఇప్పుడు అక్షర సత్యమైంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపించాయి. ఇదే అంశంపై కాకతీయ పత్రికలో పలుమార్లు ఆర్వో కార్యాలయం సహా ఇతర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమాలు, అవినీతి పర్వంపై కథనాల్లో ఎండగట్టింది. ఇప్పుడు తాజాగా వరుసగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దాడులు, సోదాలు జరుగుతుండటం గమనార్హం.


