మహిళా వ్యాపారి ఆత్మహత్య యత్నం
తన భర్తను పోలీసులు పట్టుకెళ్లారని ఆవేదన
పది రోజులైనా సమాచారం ఇవ్వడం లేదని ఆరోపణ
ఆత్మహత్యకు యత్నించిన వ్యాపారి లడే మాధవి
వారం క్రితం తిరుపతి రూ.3కోట్లకు ఐపీ పెట్టినట్లు ప్రచారం
చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ధర్నా చేసిన వ్యాపారులు
కాకతీయ, వరంగల్ : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ వ్యాపార లైసెన్స్ హోూల్డర్ (మహిళా వ్యాపారి) లడే మాధవి బుధవారం ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం ఆమె ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు సమాచారం. ఈ సంఘటన వరంగల్ వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది. తన భర్త తిరుపతిని ఏనుమాముల పోలీసులు పట్టుకెళ్లారని మాధవి ఆరోపిస్తోంది. ఈ మేరకు సూసైడ్ నోట్ రాసి.. ఆత్మహత్యకు యత్నించింది. లడే మాధవి పేరిట ఏనుమాముల మార్కెట్లో వ్యాపార లైసెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవల రూ.3కోట్లకు ఐపీ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పలువురు వ్యాపారులు గత గురువారం ఏనుమాముల మార్కెట్లో ధర్నా చేపట్టారు. ఇదిలా ఉండగా, తన భర్త లడే తిరుపతిని ఏనుమాముల పోలీసులు తీసుకెళ్లారని మాధవి ఆవేదన వ్యక్తం చేస్తోంది. పది రోజులైనా తన భర్త ఆచూకీ తెలపడం లేదని పోలీసుల తీరుపై అనుమానం వ్యక్తం చేసింది. తనను, తన కుటుంబ సభ్యులను సైతం పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు బుధవారం ఒక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు యత్నించించింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది.
ఆ రోజే పంపించాం: పోలీసులు
లడే తిరుపతిని తీసుకెళ్లిన రోజునే ఇంటికి పంపించామని పోలీసులు పేర్కొంటున్నారు. మరుసటి రోజు రావాలని చెప్పామని, కానీ.. ఆయన రాలేదని చెబుతున్నారు. నిజంగా పోలీసులు కేసు నమోదు చేసి ఉంటే.. మరుసటి రోజు రాకపోతే.. ఇంతకాలం ఏం చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారి లడే మాధవి, పోలీసుల వాదనలు భిన్నంగా ఉండడం విస్మయం కలిగిస్తోంది. పోలీసులు పంపిస్తే.. తిరుపతి ఎటు వెళ్లినట్లు.. మాధవి ఆరోపణలతో తిరుపతిని వెతుకుతారా? ఫిర్యాదు అందలేదని వదిలేస్తారా? వేచిచూడాలి.


