మొక్కజొన్న కొనుగోళ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం
నల్లబెల్లి బీజేపీ అధ్యక్షుడు తడక వినయ్ గౌడ్
రుద్రగూడెంలో రైతులతో కలిసి రాస్తారోకో
కాకతీయ, నల్లబెల్లి : మక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న అవ్యవస్థలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తాలు సరిపడా లేకపోవడం, కొనుగోళ్లు నిలిచిపోవడంతో నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి వారం రోజులు గడిచినా మక్కజొన్న కుప్పలు అలాగే పేరుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎకరాకు సగటున 40 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నప్పటికీ, కేవలం 25 క్వింటాళ్లకే కొనుగోలు చేయడం అన్యాయమని రైతులు ప్రశ్నించారు. బస్తాలు సరిపడా అందుబాటులో లేకపోవడం, వచ్చినా అరకొరగా ఉండటంతో పంటను పూర్తిగా అమ్ముకోలేకపోతున్నామని తెలిపారు. ఆన్లైన్లో భూములకు గరిష్టంగా 25 క్వింటాళ్లే నమోదు చేస్తామనే నిబంధనతో మిగిలిన పంటను ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపి వారిని శాంతింపజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సారంగపాణి మాట్లాడుతూ రైతులు రోడ్డెక్కే పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఎకరాకు పరిమితులు విధించడం, బోనస్ ఇవ్వకపోవడం, అనవసర నిబంధనలు పెట్టడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో బస్తాలు, కాంటాలు సరిపడా అందుబాటులో లేవని, వెంటనే వాటిని సమకూర్చి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రోజులు గడుస్తున్నా కాంటాలు వేయకపోవడంతో రైతులు దళారులకు తక్కువ ధరకు పంటను అమ్ముకోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించి రైతులకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.


