హుజూరాబాద్లో ఏసీబీ రైడ్
లంచం తీసుకుంటూ చిక్కిన మునిసిపాలిటీ ఏఈ
ఎంబీ రికార్డులను పూర్తి చేసేందుకు లంచం డిమాండ్
ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్… ప్రణాళికతో డబ్బులు తీసుకుంటుండగా పట్టివేత
కాకతీయ చెప్పింది.. ఏసీబీ రైడ్ జరిగింది..!
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీలో అవినీతి ఘటన వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ నుసుం సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. బుధవారం హుజూరాబాద్ ఆర్టీసీ డిపో చౌరస్తా వద్ద కాంట్రాక్టర్ నుంచి రూ.50,000 లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు అతడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన వర్షపు నీటి కాలువ పనులకు సంబంధించిన మెజర్మెంట్ బుక్ (ఎంబీ) నమోదు చేసి తుది బిల్లును ప్రాసెస్ చేయడానికి లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధిత కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారు పక్కా ప్రణాళికతో నిందితుడి వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి కరీంనగర్లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. అలాగే లంచం డిమాండ్ చేసే ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూచించింది.
కాకతీయ చెప్పింది.. ఏసీబీ రైడ్ జరిగింది..!
అవినీతి కేంద్రాలపై ఏసీబీ దృష్టి సారించిందనే విషయాన్ని ఈనెల 13న కాకతీయలో సమగ్రమైన కథనాన్ని ప్రచురించింది. మునిసిపాలిటీ, రెవెన్యూ, రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ నిఘా కొనసాగుతోందని కథనంలో హెచ్చరించింది. కాకతీయలో ప్రచురితమైన కథనం అక్షర సత్యమైంది. తాజాగా జరిగిన రైడ్తో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.


