వీరస్వామికి దళిత రత్న బహూకరణ
రవీంద్రభారతిలో ఘనంగా సత్కారం
కాకతీయ, ఖమ్మం టౌన్ : అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన కనకపుడి వీరస్వామికి ప్రతిష్టాత్మక “దళిత రత్న” అవార్డు ప్రదానం చేశారు. రవీంద్రభారతిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కమిటీ చైర్మన్ సుదర్శన్, కో-కన్వీనర్ శివకుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలంగాణ మాదిగ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్ అవార్డును అందజేశారు. సమాజంలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి అంకితభావంతో సేవలందిస్తున్నందుకు కనకపుడి వీరస్వామిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న ఆయన సేవలు అభినందనీయమని కొనియాడారు. అవార్డు అందుకున్న అనంతరం కనకపుడి వీరస్వామి తనపై విశ్వాసం ఉంచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.


