రేవంత్ రెడ్డి పేమెంట్ కోట సీఎం
పేదల ఇల్లు కూలగొట్టటమే కాంగ్రెస్ పతనానికి నాంది
జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి శూన్యం
దోచుకోవడమే పరామావధిగా ఆ ముగ్గురు పనిచేస్తున్నారు
సీతారామ ప్రాజెక్టు అంచనాలు పెంచి ప్రజా ధనం లూటీకి యత్నాలు
దీనిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ దశల వారీగా ఉద్యమం
నియోజకవర్గాల పునర్విభజనతో జిల్లాలో 3 నుంచి 4 సీట్లు పెరిగే అవకాశం
19న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి
పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
కాకతీయ, వైరా : పేమెంట్ కోటలో సీఎం అయిన రేవంత్ రెడ్డి.. దమ్ముంటే రాష్ట్రంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చూపాలంటూ మాజీమంత్రి పువ్వాడ అజయ్కుమార్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అప్పు కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరంలో చేసిందని విమర్శించారు. బుధవారం వైరాలోని స్థానిక కట్టా నరసింహారావు స్వగృహంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీమంత్రి కార్యకర్తలతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ మాట్లాడుతూ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ అభివృద్ధి శూన్యమని అన్నారు. పేదలు కట్టుకున్న ఇళ్లను కూల్చి దోచుకోవడమే వారి పరమ విధిగా మారిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి గురించి ప్రజలే మాట్లాడుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నర సంవత్సరాలలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధేంటో వివరాలు తెలియజేయాలని అన్నారు. ఖమ్మంలో వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో ఇల్లు నిర్మించుకున్న 8 20 మందికి కేవలం 310 ఇల్లు మాత్రమే కేటాయించారని అన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అందరికీ ఇల్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
జిల్లాలో 15 నియోజకవర్గాలు..!
33% మహిళా బిల్లు ప్రవేశపెడితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 15 నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో త్వరలో పెను మార్పులు చోటుచేసుకుంటాయని అన్నారు. పార్లమెంటు స్థానాలు, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని, వాటి కనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా అడుగులు వేస్తుందన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు స్వలాభం కోసం ధనార్జననే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడే ధోరణి పూర్తిగా వ్యతిరేకంగా ఉందన్నారు. బీఆర్ ఎస్ పార్టీకి కోటి రూపాయల విరాళం ఇచ్చి.. ప్రభుత్వంలో నువ్వు వేల కోట్లు లబ్ధి పొందిన మాట వాస్తవమా కాదా అని సూటిగా ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టు అంచనా పెంచి రూ.19వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకోవడానికి ఈ ప్రభుత్వంలోని పెద్దలు సిద్ధమయ్యారని అన్నారు.దీనిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ దశలవారీగా ఉద్యమాలు చేపడతుందని తెలిపారు. ఈనెల 19న ఖమ్మంలో జరిగే ఆత్మీయ సమ్మేళనానికి ప్రతి కార్యకర్త హాజరుకావాలని అన్నారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరవుతున్నారని సకాలంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,ఖమ్మం బీఆర్ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, నాయకులు కట్టా కృష్ణార్జునరావ్ ,వనమా విశ్వేశ్వరరావు ,బీఆర్ఎస్ మండల పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరావు,అప్పుం సురేష్,కొణిజర్ల మండలం అధ్యక్షులు పోట్ల శ్రీనివాసరావు, ,వార్డు కౌన్సిలర్లు కట్టా స్వరూప రాణి,మాదినేని సునీత, దుర్గాప్రసాద్, దొంతబోయిన వెంకటేశ్వరరావు, కామినేని శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.


