చెత్త పనులు చెత్తగా
మహబూబాబాద్ మున్సిపల్ కార్యాలయంలో చెత్తవేసి నిరసన
నెలరోజులుగా చెత్త సేకరణ లేక ప్రజల ఆగ్రహం
వార్డు కౌన్సిలర్ జేరిన బేగం ఆధ్వర్యంలో ఆందోళన
కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 21వ వార్డులో నెలరోజులుగా చెత్త సేకరణ జరగకపోవడంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో, చెత్త డబ్బాలు, సంచులతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని కార్యాలయంలోనే చెత్త పోసి నిరసన తెలిపారు. గత నెల రోజులుగా తమ వార్డులో చెత్తను సేకరించకపోవడంతో దుర్వాసన, అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని స్థానికులు వాపోయారు. ఇతర వార్డుల్లో చెత్త సేకరణ జరుగుతుండగా, తమ వార్డును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమాచారం అందుకున్న మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ ఘటనపై స్పందించి, వెంటనే 21వ వార్డులో చెత్త సేకరణ చేపట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ జేరిన బేగం మాట్లాడుతూ, నెల రోజులుగా మున్సిపల్ సిబ్బంది చెత్త సేకరణకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రజలు తమపై నమ్మకం ఉంచి ఓటు వేస్తే, ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఏమి సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి వార్డులో చెత్త సేకరణను క్రమబద్ధంగా నిర్వహించాలని అధికారులను కోరారు. సమస్యలు తలెత్తిన వెంటనే స్పందించాలని, లేకపోతే మరింత తీవ్ర నిరసనలు చేపడతామని హెచ్చరించారు. స్థానిక ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో ఈ నిరసనలో పాల్గొన్నారు.



