- విజయవంతంకోసం విస్తృత ప్రచారం కల్పించాలి
- కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : సింగరేణి కాలరీస్ సంస్థ సౌజన్యంతో ఈనెల 12న కొత్తగూడెం క్లబ్లో జరిగే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. గురువారం స్థానిక కొత్తగూడెం క్లబ్లో జాబ్ మేళా సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ సింగరేణి కాలరీస్ సంస్థ సౌజన్యంతో కొత్తగూడెం కేంద్రంగా జరిగే ఈ జాబ్ మేళాకు 50కి పైగా కంపెనీలు హాజరవుతున్నాయని చెప్పారు. జిల్లా నలు మూలల నుంచి 10వేల మందికి పైగా హాజరయ్యేలా జిల్లాలో ఉన్న అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని సూచించారు. మూడు వేలకు పైగా ఉద్యోగాలు కల్పించేందుకు నిర్వహిస్తున్న జాబ్ మేళా నిరుద్యోగల పాలిట వరంగా మారుతుందని తెలిపారు.
10వ తరగతి పాస్ అయిన వారి నుంచి మొదలుకుని, ఐటిఐ, డిప్లొమా, ఫార్మసీ, ఎంబిఏ, ఎంసిఓ, గ్రాడ్యూయేషన్, పోస్టుగ్రాడ్యుయేట్, బిఇ, బిటెక్, ఎంటెక్, తదితర చదువులు చదివిన వారంతా ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందేందుకు హాజరుకావచ్చని చెప్పారు. దిగ్గజ సాఫ్ట్వేర్, ఫార్మసీ కంపెనీలతో పాటు పలు కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. జాబ్ మేళాకు హాజరయ్యేందుకు ముందుగా రిజిస్ట్రేన్ చేయించుకోవాల్సి ఉంటుందని, క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉందని ఎమ్మెల్యే చెప్పారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వీలుకాని వారు కూడా నేరుగా హాజరై స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుని జాబ్మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. ఒక్కో అభ్యర్థి కనీసం 5 కం పెనీలు నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు అయ్యే విధంగా టోకెన్ పాస్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.
ఉద్యోగానికి అభ్యర్థులు ఎంపికైన వెంటనే అక్కడికక్కడే ఆయా కంపెనీలు ఉద్యోగం కల్పిస్తున్నట్లు ఒప్పంద పత్రాలను కూడా ప్రముఖల చేతుల మీదుగా అందిస్తారని చెప్పారు. అనంతరం జాబ్ మేళా ప్రచార పోస్టర్ను విడుదల చేశారు. తహసీల్దార్ పుల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మురళీధర్, సింగరేణి ఎసీ-2 జిఎం కోటిరెడ్డి, ఏజిఎం (సివిల్) రామకృష్ణ, డిజిఎం (పర్సనల్) మోహన్ రావు, ఎస్టేట్ ఆఫీసర్ తావుర్య, జాబ్ మేళా కో-ఆర్డినేటర్ చందర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఆర్డిఓ మధు, కార్పోరేషన్ కమీషనర్ సుజాత, డీఎస్పీ రెహమాన్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాపా, గుర్తింపు సంఘం నాయకులు వట్టికొండ మల్లిఖార్జునరావు, నాయకులు కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళీ, సలిగంటి శ్రీనివాస్, చంద్రగిరి శ్రీనివాసరావు, జి వీరస్వామి, తహశిల్దార్లు, ఎంపిడిఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


