ప్రశాంతంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు
91.21 శాతం పోలింగ్ నమోదు : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కాకతీయ,ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆదివారం ఆరు మండలాల్లో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండో విడతలో 160 గ్రామ పంచాయతీలు, 1,379 వార్డులకు నిర్వహించిన పోలింగ్లో 91.21 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని చెప్పారు. ఉదయం 9 గంటల వరకు 27.78 శాతం, 11 గంటలకు 64.32 శాతం, మధ్యాహ్నం 1 గంట వరకు 85.95 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు టోకెన్లు జారీ చేసి ఓటు వేసే అవకాశం కల్పించడంతో మొత్తం పోలింగ్ శాతం 91.21కి చేరిందని వివరించారు. మండలాల వారీగా కామేపల్లి మండలంలో 87.03 శాతం, ఖమ్మం రూరల్ మండలంలో 93.76 శాతం, కూసుమంచి మండలంలో 90.92 శాతం, ముదిగొండ మండలంలో 91.52 శాతం, నేలకొండపల్లి మండలంలో 91.69 శాతం, తిరుమలాయపాలెం మండలంలో 91.57 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. మొత్తం 2,48,239 మంది ఓటర్లకు గాను 2,26,417 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా కలెక్టరేట్ నుంచి నిరంతర మానిటరింగ్ చేపట్టామని, ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కౌంటింగ్ పూర్తయ్యాక ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కలెక్టరేట్లోని వెబ్కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా ఆరు మండలాల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట డీఆర్వో ఏ. పద్మశ్రీ, సీపీఓ ఏ. శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ కె. శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది, టెక్నికల్ టీం సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


