కాకతీయ, తెలంగాణ బ్యూరో: నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచిన సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై ప్రభుత్వం వేటు వేసింది. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యేతో పంచాయతీ, హైకోర్టు ఆగ్రహించిన వేళ కలెక్టర్ ను టీఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శిగా ట్రాన్స్ ఫర్ చేసింది. దీంతో సిరిసిల్లలో స్థానిక నాయకులు సంబురాలు చేసుకున్నారు. పట్టణంలోని విద్యానగర్ లో ఓ ఆలయం కొబ్బరికాయలు కొట్టి, పటాకులు కాల్చి సంతోషం వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 6గురు ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు. అందులో సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కూడా ఉన్నారు. ఆయనను టీఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శిగా ట్రాన్స్ ఫర్ చేసింది. సందీప్ కుమార్ స్థానంలో సిరిసిల్ల కలెక్టర్ గా హరితను నియమించారు. వీరితోపాటు మొత్తం ఆరుగురు ఐఏఎస్ లు ట్రాన్స్ ఫర్ అవ్వగా..ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య పన్నుల కమిషనర్ గా ఎం రఘునందన్ రావు ట్రాన్స్ ఫర్ అయ్యారు. రవాణా శాఖ కమిషనర్ గా కూడా రఘునందన్ రావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. వ్యవసాయ శాఖ కమిషనర్ కే సురేంద్ర మోహన్, జీఏడీ ముఖ్య కార్యదర్శిగా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కే హరిత నియామకం అయ్యారు.


