నియో పోలీస్కు నీటి భరోసా!
జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు
గ్రావిటీ విధానంలో మెహదీపట్నం, షేక్పేటకు సరఫరా
పంపింగ్ ఖర్చులు లేకుండా బోజగుట్ట రిజర్వాయర్కు గోదావరి జలాలు
పెరుగుతున్న జనాభాకు దీర్ఘకాలిక ప్రణాళిక
ఖానాపూర్లో మౌలిక వసతుల విస్తరణకు శ్రీకారం
కాకతీయ,తెలంగాణ బ్యూరో : నియో పోలీస్ ప్రాంతంలో పెరుగుతున్న తాగునీటి అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జలమండలికి ఖానాపూర్ పరిసరాల్లో 3.95 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూమిలో నిర్మించనున్న మౌలిక వసతుల ద్వారా గ్రావిటీ విధానంలోనే నగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా ఔటర్ రింగ్ రహదారి పరిసర ప్రాంతాల్లో వేగవంతమైన జనాభా వృద్ధి, ఎత్తైన భవనాల నిర్మాణం కారణంగా నీటి అవసరం రోజురోజుకు పెరుగుతోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గోదావరి తాగునీటి సరఫరా ప్రాజెక్టు రెండో, మూడో దశలను అమలు చేస్తోంది. మూసీ పునరుజ్జీవనంతో పాటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను గోదావరి జలాలతో నింపేందుకు అదనంగా 300 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలించే ప్రణాళిక చేపట్టింది.
అదనపు భూమి అవసరం
నియో పోలీస్–కోకాపేట ప్రాంతాల్లో అధిక స్థాయి నిలువు పట్టణీకరణ కారణంగా నీటి అవసరం మరింత పెరిగింది. ఇప్పటికే కోకాపేట నియోపోలిస్ లేఅవుట్లో సంప్, పంప్ హౌస్, విభాగ కార్యాలయం, భూమి మట్టంలోని నిల్వ ట్యాంక్, మలినజల శుద్ధి కేంద్ర నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ జలమండలికి ఉన్న భూమి పూర్తిగా వినియోగించబడటంతో అదనపు స్థలం అవసరమైంది. ఖానాపూర్లో జలమండలికి ఉన్న 8.75 ఎకరాల భూమి ప్రతిపాదిత 22.5 మిలియన్ లీటర్ల మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, రెండు ఎత్తైన సేవా రిజర్వాయర్లు, క్లోరినేషన్ గది, నిర్వహణ విభాగం నిర్మాణాలకు మాత్రమే సరిపోతుందని అధికారులు తెలిపారు.
గ్రావిటీతోనే సరఫరా
దీంతో ఖానాపూర్ జలమండలి ఆవరణకు ఆనుకుని ఉన్న భూముల్లో 1.18 ఎకరాలు పైట్యాంక్ కోసం, 0.77 ఎకరాలు కార్యాలయ నిర్మాణానికి, ఆశ్రమానికి చెందిన 2 ఎకరాలు కలిపి మొత్తం 3.95 ఎకరాలు కేటాయించాలని జలమండలి ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. సుమారు 592 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ భూభాగం భౌగోళిక స్థితిగతుల ప్రకారం గ్రావిటీ విధానంలోనే మొత్తం సేవా ప్రాంతానికి తాగునీటిని సరఫరా చేయడానికి అనుకూలంగా ఉంది. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో నియో పోలీస్, కోకాపేట ప్రాంతాలకే కాకుండా బోజగుట్ట రిజర్వాయర్కు కూడా పంపింగ్ అవసరం లేకుండానే గోదావరి జలాలు చేరవచ్చు. అదేవిధంగా పాతబస్తీ, షేక్పేట, రెడ్ హిల్స్, మెహదీపట్నం ప్రాంతాలకు కూడా గ్రావిటీ ద్వారా నీటి సరఫరా చేయడం సాధ్యమవుతుంది. దీని వల్ల విద్యుత్ ఛార్జీల్లో గణనీయమైన ఆదా కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు. పెరుగుతున్న పట్టణ విస్తరణకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నియో పోలీస్ ప్రాంతానికి తాగునీటి భద్రత కల్పించడంలో కీలకంగా మారనుంది. దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య నగరాభివృద్ధి దిశగా మరో ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.


