మేడారం మహా జాతర ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష
మేడారంలో నలుగురు మంత్రుల పర్యటన
భక్తుల సౌకర్యాల కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు
220 కోట్లతో జాతర పనులు ఊపందుకున్నాయి
ఓకే వేదికపై కొండ సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
కాకతీయ, ములుగు ప్రతినిధి: ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసి జాతరగా పిలవబడుతున్న తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర 2026 ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రులు గృహ నిర్మాణం మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, దేవాదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వడ్లూరి లక్ష్మణ్ అన్ని శాఖల అధికారులతో బుధవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు విభిన్న శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేయగా జాతర ఏర్పాట్ల పురోగతి పై ఈ సమీక్ష సమావేశం కీలకం కానుంది.
కోటికి పైగా భక్తుల రాకకు సిద్ధమవుతున్న మేడారం…
రాబోయే సంవత్సరం జనవరి 28 నుండి 31 వరకు జరగబోయే మేడారం మహా జాతరకు ఈసారి కోటి యాభై లక్షల మంది భక్తులు తరలివస్తారని జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది. భారీగా భక్తులు రావడంతో రహదారులు, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, విద్యుత్, శానిటేషన్, వైద్య సదుపాయాలు వంటి ఏర్పాట్లను విస్తృత స్థాయిలో చేపడుతున్నారు.
220 కోట్లతో భారీ అభివృద్ధి పనులు…
మేడారం మహాజాతర 2026 దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తొలుత 150 కోట్ల రూపాయలు కేటాయించగా, తరువాత మేడారం వనదేవతల ఆలయా ప్రాంతాన్ని మరింత విస్తరించి అందంగా తీర్చిదిద్దే పనుల కోసం అదనంగా 70 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ వివరాలను ఈ నెల 13న జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అమ్మల గద్దెల పరిసర ప్రాంతాల విస్తరణ, కొత్త రోడ్లు, తాత్కాలిక వసతిగృహాలు, పార్కింగ్ స్థలాలు, సీసీ కెమెరాలు, వైద్యశిబిరాలు, మురుగు నీటి పారుదల వ్యవస్థలు వంటి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
80 రోజులలో పూర్తి చేయాలని లక్ష్యం…..
రాష్ట్ర ప్రభుత్వం మహా జాతర పనులను వచ్చే 90 రోజులలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జాతర ప్రాంతం చుట్టుపక్కల మౌలిక వసతులను శాశ్వతంగా అభివృద్ధి చేయాలని కూడా మంత్రులు నిర్ణయించారు. ఈ సమావేశంలో అధికారులు శాఖ వారీగా చేపట్టిన పనుల పురోగతిని, జాతర సమయం ఇంకా 80 రోజులే ఉన్నందున సమయంలో పనులు ఎలా పూర్తి చేయాలని అంశంపై అధికారులకు ఆయా శాఖ మంత్రులు దిశా నిర్దేశం చేయనున్నారు.
ప్రజల అంచనాలకు తగ్గ ఏర్పాట్లు….
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది.ఈసారి మహా జాతర నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత సమగ్ర సన్నాహకాలు, భక్తులకు సౌకర్యాలు కల్పించడం ద్వారా మేడారం జాతరను మరింత వైభవంగా నిర్వహించాలని సంకల్పించింది. ఇందుకోసం కావలసిన నిధులను ఇప్పటికే మంజూరు చేసి అభివృద్ధి పనులను ప్రారంభించింది.


