భరోసా కేంద్రాలు బాధితులకు బలమైన అండ
అడిషనల్ డీజీపీ (సీఐడీ & ఏసీబీ) చారు సిన్హా
కాకతీయ, కరీంనగర్ : లైంగిక వేధింపులకు గురైన మహిళలు, చిన్నారులకు సురక్షిత వాతావరణంలో సేవలు అందిస్తూ ‘భరోసా’ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అడిషనల్ డీజీపీ (సీఐడీ & ఏసీబీ) చారు సిన్హా తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం కొత్తపల్లిలోని భరోసా కేంద్రాన్ని ఆమె సందర్శించి, అక్కడి సేవలను పరిశీలించారు. కేంద్రంలోని విభాగాలను పరిశీలించిన ఆమె, సిబ్బందితో మాట్లాడి పనితీరును సమీక్షించారు. రికార్డులను పరిశీలిస్తూ రిజిస్టర్ల నిర్వహణను సక్రమంగా కొనసాగించాలని సూచించారు. బాధితులకు తక్షణ న్యాయ సహాయం, కౌన్సిలింగ్ అందించడంలో ఆలస్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా పక్కా ఆధారాలు సేకరించాలని, కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అందించే నష్టపరిహారం సకాలంలో చేరేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. 2024 డిసెంబరులో ప్రారంభమైన ఈ కేంద్రం ద్వారా బాధితులకు ఒకే చోట పోలీస్, వైద్య, న్యాయ సేవలు అందించడం సానుకూల పరిణామమన్నారు. తనిఖీ అనంతరం కేంద్రం ప్రాంగణంలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ వెంకటరమణ, ఏసీపీ వెంకటస్వామి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పుల్లయ్య, ఎస్సై అనూష, భరోసా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.


