గంజాయి మత్తులో చిత్తవుతున్న యువత
కరీంనగర్ టౌన్లో మూడు నెలల్లో 27 కేసులు
బానిసలుగా మారుతున్న కార్మికులు, నిరుద్యోగులు
గంజాయి సేవనంతో పాటు రవాణాదారులకు యువత
కాకతీయ, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా విస్తరిస్తూ యువతను మత్తు బారిన పడేస్తున్న పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో యువకులు, కార్మికులు, నిరుద్యోగులు ఈ మత్తు వలలో చిక్కుకుంటుండటం కలవరపెడుతోంది. గత మూడు నెలల్లోనే 27 గంజాయి కేసులు నమోదవడం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తోంది. స్మగ్లర్లు గుట్టుచప్పుడు కాకుండా తమ కార్యకలాపాలను విస్తరించుకుంటూ, తక్కువ డబ్బు ఆశ చూపించి నిరుద్యోగ యువతను రవాణా, విక్రయాల్లోకి దింపుతున్నారని సమాచారం. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా గంజాయి సరఫరా పెరుగుతుండటం మరింత ఆందోళనకరం. కొంతమంది విద్యార్థులు కూడా ఈ మత్తు పదార్థాల బారిన పడుతున్నారనే వార్తలు పరిస్థితి ప్రమాదకర దిశగా వెళ్తున్నాయని సూచిస్తున్నాయి. పోలీసులు దాడులు నిర్వహించి గంజాయి స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ, స్మగ్లర్ల చతురత ముందు అవి సరిపోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పటిష్ట నిఘా లోపించడంతో అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడం కష్టంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గంజాయి నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. విద్యాసంస్థలు, కార్మిక వర్గాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, అనుమానాస్పద కదలికలపై కఠినంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే ఈ మత్తు జాలానికి అడ్డుకట్ట వేయగలమని నిపుణులు సూచిస్తున్నారు.


