డంపింగ్ యార్డ్తో 9మండలాలపై ప్రభావం
500 ఎకరాల్లో భూ సేకరణ జరుగుతోంది
ప్రతిపాదనను వెనక్కు తీసుకోకుంటే ఉద్యమం ఉధృతం
హుజురాబాద్లో లక్షమందితో మహాధర్నా చేపడుతాం
గ్రామసభతో ప్రజాభిప్రాయం తెలుసుకోవాలి
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరాహార దీక్షలు 22వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు హుజురాబాద్ క్లబ్ సభ్యులు సంఘీభావం ప్రకటించగా, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు 22 రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. డంపింగ్ యార్డ్ కోసం సుమారు 500 ఎకరాల భూమి సేకరణ జరుగుతోందని సమాచారం ఉందని, వెంటనే ఈ ప్రతిపాదనను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సుడా చైర్మన్ ప్రజలు డంపింగ్ యార్డ్కు అనుకూలంగా ఉన్నారని చెప్పడం సరికాదని, నిజమైన ప్రజాభిప్రాయం తెలుసుకోవాలంటే గ్రామ సభ నిర్వహించాలని సూచించారు. గ్రామ సభ ద్వారా వాస్తవ పరిస్థితి బయటపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోకపోతే జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ డంపింగ్ యార్డ్ వల్ల 9 మండలాల ప్రజల ఆరోగ్యం, పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అఖిలపక్షం ఏర్పాటు అనంతరం లక్ష మందితో మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు. డంపింగ్ యార్డ్ ప్రతిపాదన పూర్తిగా రద్దయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ నెల 19న డంపింగ్ యార్డ్ ప్రాంతంలో నిర్వహించనున్న మల్లన్న పట్నాలు కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


