జనగణన బాధ్యతల కేటాయింపులో గందరగోళం
డ్యూటీలు లేక కొందరు… ఇద్దరికి రెండేసి చోట్ల బాధ్యతలు!
టీఈఏ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. ఖాద్రీ
కాకతీయ, కరీంనగర్ : జనగణన సర్వే నిర్వహణలో ఎన్యూమరేషన్ డ్యూటీల కేటాయింపులో తీవ్ర అసమానతలు చోటుచేసుకున్నాయని, వాటిపై పునరాలోచించి తక్షణ సవరణలు చేపట్టాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. ఖాద్రీ అధికారులను విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కొంతమంది ఉపాధ్యాయులకు డ్యూటీలు కేటాయించకపోగా, మరికొందరికి ఒకేసారి రెండు చోట్ల బాధ్యతలు ఇవ్వడం వల్ల అయోమయం నెలకొంటోందన్నారు. అనారోగ్య సమస్యలతో డ్యూటీలు నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నవారికి మినహాయింపు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
డ్యూటీలు రద్దు చేసుకునే వారి స్థానంలో సిద్ధంగా ఉన్న కొత్త వారికి అవకాశాలు కల్పించాలని, ఇప్పటివరకు డ్యూటీలు రాక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వారిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. విధులు నిర్వహించేందుకు ముందుకు వస్తున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు.
మానవీయ దృక్పథంతో అధికారులు నిర్ణయాలు తీసుకుంటేనే జనగణన ప్రక్రియ సమర్థవంతంగా సాగుతుందని, లేనిపక్షంలో అనవసర ఇబ్బందులు తలెత్తే అవకాశముందని ఖాద్రీ తెలిపారు.


