కమ్యూనిస్టులంతా ఏకం కావాలి
బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతోంది
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
డిసెంబర్ 26 ఖమ్మం శతాబ్ది సభలను విజయవంతం చేయాలని పిలుపు
కాకతీయ, గోదావరిఖని : దేశంలో కమ్యూనిస్టు పార్టీ శతాబ్దిని పురస్కరించుకుని జరుగుతున్న ఉత్సవాలు చారిత్రాత్మకమని, ఈ సందర్భంలో కమ్యూనిస్టు శక్తులన్నీ ఐక్యంగా ముందుకు రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. భాస్కర్ రావు భవన్లో ఎఐటియుసి అర్జీ–1 బ్రాంచ్ నిర్వహించిన కార్మిక కుటుంబాల సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో వందేళ్లుగా ప్రజల మధ్య నిరంతర పోరాటం సాగిస్తున్న ఏకైక పార్టీ సీపీఐ అని తెలిపారు. మావోయిస్టులు ఆయుధాలు విడిచి ప్రజా స్రవంతిలోకి వచ్చి ఎడమపక్ష ఐక్యతకు సహకరించాలని సూచించారు. బీజేపీ చేపట్టిన ఆపరేషన్ కగారు పేరుతో జరుగుతున్న అణచివేతలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.1942లో స్థాపించబడిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కార్మిక హక్కుల కోసం ఎన్నో మైలురాయి పోరాటాలు చేసినట్లు ఆయన గుర్తుచేశారు. శేషగిరిరావు, మఖ్దూం, సర్వదేవబట్ల రామనాథం, నల్లమల గిరిప్రసాద్ వంటి నేతలు యూనియన్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. భాస్కరరావు, కత్తుల కొమురయ్య, చంద దుర్గయ్య వంటి నాయకుల త్యాగాలు సింగరేణి చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని అన్నారు.యూనియన్ శ్రేణులు పార్టీతో మమేకమై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి బలాన్ని చాటాలని సూచించారు. బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అభ్యుదయవాదులను అణచివేస్తోందని విమర్శించారు.సమ్మేళనంలో పాల్గొన్న వందకు పైగా కార్మిక కుటుంబాలను సన్మానించారు. పారిశ్రామిక ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయడం సమయానుసారమని కూనంనేని స్పష్టం చేశారు.ఎఐటియుసి అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ మాట్లాడుతూ కార్మికులు పొందిన ప్రతి హక్కుకూ ఎఐటియుసి పోరాటమే మూలమని తెలిపారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం మాట్లాడుతూ డిసెంబర్ 26 ఖమ్మం శతాబ్ది సభలకు 42 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు.ఎఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సింగరేణి కార్మిక కుటుంబాలను ఒకే వేదికపైకి తేవడం గోదావరిఖని చరిత్రలో అరుదైన సంఘటనగా అభివర్ణించారు. మహిళలు పార్టీ–యూనియన్ కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొనాలని సూచించారు.కార్యక్రమంలో ఎల్ ప్రకాష్, కవ్వంపల్లి స్వామి, గౌతం గోవర్ధన్, గోసిక మోహన్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి కళాకారుల విప్లవ గేయాలు సభలో ఉత్సాహాన్ని నింపాయి.


