కాకతీయ, అమరావతి : ‘విద్యార్థినులకుగాని, మహిళలకుగాని ఉచిత బస్సు ప్రయాణం పథకంతో నెలకు రూ.1500 నుంచి రూ.2 వేల మేర పొదుపు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. మహిళలతో మాట్లాడుతున్నపుడు వారి కళ్లలో ఆనందం చూస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణం అంటే కేవలం రవాణా మాత్రమే కాదు.. వారి భద్రతకు తగిన విధంగా భరోసా ఇచ్చే గొప్ప పథకం అని, అందుకే ఈ పథకానికి స్త్రీ శక్తి పథకంగా పేరు పెట్టిన’ట్లు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు.
మహిళలు బస్సుల్లో ప్రయాణించే సమయంలో బస్సులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు మహిళా కండక్టర్లకు పాకెట్ కెమెరాలను అమరుస్తామని పేర్కొన్నారు. దీని ద్వారా పూర్తి భద్రతతో మహిళలు ఉచిత ప్రయాణం రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసే వీలు కలుగుతుందన్నారు. సూపర్ సిక్స్ హామీలో కీలకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అయిన స్త్రీ శక్తి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుక్రవారం ప్రారంభించారు.
ఉండవల్లి నుంచి విజయవాడ వరకూ మహిళలతో కలసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పి.వి.ఎన్.మాధవ్ గారు ప్రయాణించారు.విజయవాడ బస్టాండ్ వద్ద నిర్వహించిన సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు గురించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో చర్చించాను. ఈ హామీ అమలు సాధ్యమేనా అని అడిగినపుడు ఆయన కచ్చితంగా సాధ్యమే.. త్వరలోనే అమలు చేద్దామని సమాధానం ఇచ్చారు. ఆర్థికంగా రాష్ట్రానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ముందుచూపుతో, ఆయన అనుభవంతో వాటిని అధిగమించి ఇచ్చిన హామీని నిలబెట్టిన ఘనత శ్రీ చంద్రబాబు గారికే దక్కుతుంది. రాష్ట్రానికి ఉచిత బస్సు పథకం వల్ల ఏటా రూ.2 వేల కోట్ల భారం అయినప్పటికీ మహిళలకు ఇచ్చిన హామీ కచ్చితంగా నిలుపుకున్నాం. ఇది కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.
ఆర్థిక భద్రత, ప్రయాణ స్వేచ్ఛ, సామాజిక గౌరవానికి ప్రతీక:
ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు ఆర్థికంగా భద్రత ఉండటమే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణ స్వేచ్ఛను కల్పించినట్లు అయింది. ఇది వారికి సమాజంలోనూ గౌరవం పెంచే చర్య. జీరో ఫేర్ టిక్కెట్ల ద్వారా మహిళలు 5 రకాల బస్సుల్లో రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అయినా ఉచితంగా, భద్రంగా ప్రయాణం చేసుకునే వీలుంది. దీని కోసం 8,458 బస్సులు సిద్ధం చేశాం. ఏదైనా ఐడీ కార్డును చూపి వారు ప్రయాణం చేయవచ్చు. సూపర్ సిక్స్ హామీలను అడ్డంకులు ఉన్నప్పటికీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం.
ఇప్పటికే తల్లికి వందనం, ఉచిత గ్యాస్, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి పథకాలను అమలు చేశాం. భవిష్యత్తులో ఇచ్చిన ప్రతి హామీని సంపూర్ణంగా అమలు చేసేందుకు కృషి చేస్తాం. సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకొని ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకొస్తూనే మరోవైపు ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధి వైపు నడకను మొదలుపెట్టాం. రాష్ట్రంలో శ్రీ చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయి. అమరావతి నిర్మాణానికి, విశాఖ స్టీల్ ప్లాంటు ఆర్థిక పుష్టికి కేంద్ర సర్కారు తగిన విధంగా తోడ్పాటునందిస్తోంది. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకంలో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మరింత సుందరంగా మారబోతుంది. ప్రజలు మాపై పెట్టుకున్న భరోసాను వందశాతం నెరవేరుస్తాం’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ శ్రీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు శ్రీ బొండా ఉమామహేశ్వరరావు, శ్రీ గద్దె రామ్మోహనరావు, ఆర్టీసీ ఛైర్మన్ శ్రీ కొనకళ్ల నారాయణ, ఆర్టీసీ ఎండీ శ్రీ ద్వారకా తిరుమల రావు, రవాణా శాఖ కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే పాల్గొన్నారు.
బస్సులో మహిళలతో కలిసి ప్రయాణంచిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభానికి సూచికగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉండవల్లి గుహలు నుంచి విజయవాడ బస్ స్టేషన్ వరకు మహిళలతో కలిసి ప్రయాణించారు. బస్సులో మహిళలతో మాట్లాడుతూ వారికి ఉచిత బస్సు ప్రయాణం వల్ల కలిగే ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. పథకం వల్ల తాము చాలా లాభపడుతున్నామని, ఉచిత బస్సు తమకు అవసరం అంటూ విద్యార్థినులు, మహిళలు చెప్పారు.


