ఆవులపై పులి దాడి
మోత్కరావుపేట శివారులో అడుగులు..
అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
కాకతీయ, రుద్రంగి : వేములవాడ నియోజకవర్గంలోని భీమారం మండలం కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత ఆదివారం మోత్కరావుపేట గ్రామ శివారులోని చెరువు వద్ద పులి నీళ్లు తాగిన ఆనవాళ్లను గుర్తించిన అటవీశాఖ అధికారులు, వారం రోజుల వ్యవధిలోనే అదే ప్రాంతంలో పులి మళ్లీ సంచరించడాన్ని ధృవీకరించారు. శనివారం తెల్లవారుజామున మోత్కరావుపేట సమీపంలో ఆవుల మందపై పెద్దపులి దాడికి తెగబడింది. ఈ ఘటనలో మూడు ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు, అక్కడ లభించిన ఆధారాల ప్రకారం దాడి చేసింది పెద్దపులి అని నిర్ధారించారు. పులి కదలికల నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పశువులను ఒంటరిగా అడవి బయట మేపకూడదని, రాత్రి వేళల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. గ్రామ పరిసరాల్లో ఫారెస్ట్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, పులి కదలికలను గమనిస్తున్నట్లు వెల్లడించారు.


