కవిత పై అక్రమ కేసుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
– కడిగిన ముత్యంలా బయటపడిన జాగృతి చైర్మన్ కవిత
– జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్
కాకతీయ, గజ్వేల్ : లిక్కర్ కేసులో జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత కడిగిన ముత్యంలా బయటపడగా, ఆమె పడిన మానసిక క్షోభకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది కొట్టాల యాదగిరి ముదిరాజ్ పేర్కొన్నారు. శుక్రవారం రౌస్ ఎవెన్యూ కోర్టు కవితను నిర్దోషిగా ప్రకటించగా, ఆమెపై సిబిఐ మోపిన అభియోగాలన్నింటిని కొట్టివేసినట్లు తెలిపారు. సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఇచ్చిన తీర్పుతో ప్రజలకు చట్టాలు, కోర్టులపై మరింత నమ్మకం పెరిగిందని అన్నారు. కవితకు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో ఎలాంటి సాక్షాదారాలు లేకుండా సిబిఐ అక్రమంగా లిక్కర్ కేసు నమోదు చేసినట్లు అర్థమవుతుందని విమర్శించారు. సిబిఐ వంటి రాజ్యాంగ సంస్థ వత్తడిలతో కవితపై అక్రమంగా కేసు పెట్టి జైలు పాలు చేయడం సిగ్గుచేటు కాగా, ఇందులో ఉన్న సూత్రధారులు, పాత్రధారులకు తగిన బుద్ధి చెప్తామని చెప్పారు. రాష్ట్రంలో జాగృతి మరింత ఉత్సాహంతో పనిచేయనుండగా, బీసీల హక్కుల సాధన, 42 శాతం రిజర్వేషన్ తదితర అంశాలపై రాజీలేని పోరాటం చేస్తామని వివరించారు.


