చేర్యాల రెవెన్యూ డివిజన్ లక్ష్యంగా తీర్మానాలు చేయాలి
* చేర్యాల పట్టణ ప్రజలే పాలకవర్గానికి అధిష్టానం
* జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ళ పరమేశ్వర్
కాకతీయ,చేర్యాల : చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడమే ఏకైక లక్ష్యంతో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ పాలకవర్గం తీర్మాణం చేసి ప్రభుత్వానికి అందజేయాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్ సూచించారు. శుక్రవారం జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 9న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిపి 45మంది అభ్యర్థులు పోటీలో పాల్గొన్నారని, కేవలం 12 మందిని మాత్రమే కౌన్సిలర్లను పరిపాలన కోసం పంపించారన్నారు. ఆయా పార్టీలు బీఫాములు ఇచ్చినప్పటికీ 12 మందిని మాత్రమే ఆచితూచి ఏరి కోరి కౌన్సిలర్లు గా ఎన్నుకున్నారు. కాబట్టి ప్రజలే మీకు అధిష్టానం అని భావించి ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంత ప్రజల ఆశయం కోసమే పని చేయాలి తప్ప మీ పార్టీల ప్రయోజనం కోసమే, మీ నాయకుల మెప్పు కోసమో పనిచేయకూడదని సూచించారు. అందులో భాగంగానే ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష అయినటువంటి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం మొదటి కౌన్సిల్ సమావేశంలోనే తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని తెలిపారు. అలాగే చేర్యాల పట్టణానికి ల్యాండ్ మార్కు అయినటువంటి పట్టణం నడిబొడ్డున గతంలో ఉన్నటువంటి గ్రామపంచాయతీ స్థలంలోనే మున్సిపల్ కార్యాలయాన్ని నిర్మించాలని, అంతేకాకుండా నిజాం ప్రభుత్వం నుండి ఉన్నటువంటి ఆస్పత్రిలో బస్తీ దవాఖాన గా మార్చి కొనసాగించాలన్నారు. గత పాలకవర్గంలో జరిగినటువంటి తప్పిదాలను సరిదిద్దే క్రమంలో ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారుల కుటుంబాలు చిన్న భిన్నం అయ్యారని, వారికి పునరావసం కల్పించడానికి షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మించాలని కోరారు. మేము ఎలాంటి జీతభత్యాలు కానీ గౌరవ వేతనాలు లేకుండా స్వయం ప్రకటిత చౌకీదర్ నని అన్నారు. ఎలాంటి భేషాజాలకు అనుమానాలకు తావులేదని మా చివరి ఊపిరి ఉన్నంతవరకు చేర్యాల ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష కోసం ఆత్మగౌరవం కోసం పనిచేస్తానని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలతోటి సంబంధం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, నాయకులు ఈ ప్రాంతాన్ని విస్మరిస్తే ఎంతటి వారినైనా జేఏసీ ప్రశ్నిస్తుందని పేర్కొన్నారు. రేపటి రోజుల్లో జేఏసీని మరింత పటిష్ట పరిచి 2026 లోపు రెవెన్యూ డివిజన్ సాధించడం కోసం మడమ తిప్పని పోరాటం చేస్తున్నామని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు జేఏసీలో భాగస్వాములై కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు అందె అశోక్, అందె బీరయ్య, బుట్టి సత్యనారాయణ, తాడెం వెంకట స్వామి, సుందరగిరి భాస్కర్, ఈరి భూమయ్య, బోదాసు మైసయ్య, రామగళ్ల నరేష్, బెల్లపు నరేష్, ఉప్పల రాములు, గుండె ఉదయ్, పిల్లి చంద్రం, పోలోజు వెంకటాద్రి, తదితరులు పాల్గొన్నారు.


