రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
మార్చి 16న పోలింగ్ – తెలంగాణకు చెందిన ఇద్దరు సభ్యుల పదవీకాలం ముగింపు
న్యూఢిల్లీ: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 2026లో పదవీకాలం ముగియనున్న 10 రాష్ట్రాలకు చెందిన 37 మంది రాజ్యసభ సభ్యుల స్థానాలను భర్తీ చేయడానికి ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియను ఫిబ్రవరి 26, 2026న అధికారిక నోటిఫికేషన్ విడుదలతో ప్రారంభించనున్నారు.
నామినేషన్ల దాఖలుకు మార్చి 5 వరకు గడువు ఉండగా, మార్చి 6న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. అభ్యర్థులు తమ నామినేషన్లను మార్చి 9 వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ఎన్నికల పోలింగ్ను మార్చి 16, 2026న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికల మొత్తం ప్రక్రియను మార్చి 20, 2026లోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ, కే.ఆర్. సురేష్ రెడ్డి పదవీకాలం కూడా ఏప్రిల్ 2026లో ముగియనుంది. ఈ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు ప్రత్యేక పరిశీలకులను నియమించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
రాజ్యసభ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది.


