ఇక పాఠశాలల్లో పప్పులుడకవ్
నిధులు విధులపై ప్యానల్ టీం పర్యవేక్షణ
భద్రాద్రి జిల్లాకు 48 మంది ఉపాధ్యాయుల ఎంపిక
ప్రాథమిక స్థాయి నైపుణ్యాల పెంపు దిశగా కీలక చర్యలు
హైదరాబాద్లో ప్రత్యేక శిక్షణ అనంతరం పర్యవేక్షణ బాధ్యతలు
మూడు నెలల్లో వంద పాఠశాలల పనితీరుపై సమగ్ర పరిశీలన
హాజరు, నిధుల వినియోగం, బోధన విధానాలపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వ సరికొత్త చర్యలు
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించి విద్యా ప్రమాణాలను మెరుగుపరచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పాఠశాలల్లో నిధుల వినియోగం, బోధన విధానాలు, ఉపాధ్యాయుల విధుల నిర్వహణపై సమగ్ర పర్యవేక్షణ కోసం ప్రత్యేక ప్యానల్ బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ప్రభుత్వ పాఠశాలల పనితీరును పరిశీలించి నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పించనున్నాయి. విద్యార్థుల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బోధన విధానాలను మెరుగుపరచడం, నాణ్యమైన విద్య అందించడం ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
భద్రాద్రి జిల్లాకు 48 మంది ఉపాధ్యాయుల ఎంపిక
ఈ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మొత్తం 48 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. వీరిలో ఎస్జీటీలు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు ఉండగా, ప్రత్యేక బృందాలుగా నియమించి పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఎంపికైన ఉపాధ్యాయులకు హైదరాబాద్లో ప్రత్యేక శిక్షణ అందించగా, అనంతరం జిల్లా వ్యాప్తంగా వారికి కేటాయించిన పాఠశాలలను పరిశీలించనున్నారు. ప్రతి బృందంలో ఒకరు నోడల్ అధికారిగా, ఇద్దరు సభ్యులుగా వ్యవహరిస్తూ పర్యవేక్షణ నిర్వహించనున్నారు.
పాఠశాలల పనితీరుపై సమగ్ర పరిశీలన
ప్రత్యేక బృందాలు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల పనితీరును సమగ్రంగా పరిశీలించనున్నాయి. మూడు నెలల వ్యవధిలో సుమారు 100 పాఠశాలలను తనిఖీ చేసి బోధన విధానం, నిధుల వినియోగం, విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలపై నివేదికలను సిద్ధం చేయనున్నారు. విద్యార్థుల ప్రగతిని పెంపొందించే విధంగా కృత్యాధార బోధన అమలు, బోధనా సామగ్రి వినియోగం, తరగతుల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించనున్నారు. అవసరమైన చోట ఉపాధ్యాయులకు సూచనలు అందించి విద్యా ప్రమాణాల పెంపుకు మార్గనిర్దేశం చేయనున్నారు.
ఉపాధ్యాయుల హాజరుపై ప్రత్యేక నిఘా
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు, విధుల నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇప్పటికే అమలులో ఉన్న ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానంతో పాటు, ఆకస్మిక తనిఖీల ద్వారా విధులకు గైర్హాజరు అయ్యే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పాఠశాలల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంతో పాటు విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్యానల్ బృందాల పర్యవేక్షణ కీలకంగా మారనుంది. ఈ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపడి విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెరుగుతాయని విద్యాశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


