ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ
సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు
డీఎస్పీ రవీందర్ రెడ్డి పర్యవేక్షణ
కాకతీయ, మణుగూరు: మణుగూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను మణుగూరు సబ్ డివిజన్ డీఎస్పీ రవీందర్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక సీఐతో కలిసి కేంద్రాలను సందర్శించిన ఆయన పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు.
పరీక్షలు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయా అనే అంశంపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని, నియమావళిని కచ్చితంగా పాటించాలని సూచించారు. పరీక్షల సమయంలో క్రమశిక్షణకు భంగం కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. కేంద్రాల పరిసర ప్రాంతాల్లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 144 సెక్షన్ అమల్లో ఉందని, అనుమతి లేకుండా గుంపులు గుమికూడకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై నిఘా ఉంచినట్లు చెప్పారు.
ఈ తనిఖీల్లో సీఐతో పాటు పోలీసు సిబ్బంది, కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పరీక్షలు సజావుగా సాగేందుకు పోలీసులు అన్ని విధాలా సహకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


