కాళేశ్వరం పేరుతో భూముల దోపిడీ
చీకటి ఒప్పందాలు.. రైతులపై పోలీస్ బెదిరింపులు
మూడేళ్లలో హామీలు నెరవేర్చకపోతే రాజీనామా
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంచలన సవాల్
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధిపై గత పాలకుల పాలనను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా ఎండగట్టారు. కాళేశ్వరం లింక్–2 పేరుతో రైతుల భూములను బలవంతంగా లాక్కొని చీకటి ఒప్పందాలతో పనులు చేపట్టారని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే కరీంనగర్లో ప్రెస్మీట్ నిర్వహించినట్లు తెలిపారు.
2016లో జీవో నం.71 ప్రకారం ప్రారంభించిన ప్రాజెక్టును 2022 వరకు పూర్తి చేయకపోగా అంచనా వ్యయాన్ని రూ.136 కోట్లకు పెంచారని విమర్శించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే అప్పటి కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకుని పనులు ప్రారంభించారని అన్నారు. ధర్మపురిని సస్యశ్యామలం చేస్తామని నాటి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు మాటలకే పరిమితమయ్యాయని, 146 గ్రామాలకు సాగునీటి విషయంలో అప్పటి మంత్రులు ఒక్కసారి కూడా ప్రశ్నించలేదని మండిపడ్డారు. కాళేశ్వరం పేరుతో ఒడ్డెర జాతి ప్రజలను పోలీసులతో బెదిరించి గుట్టను ఖాళీ చేయించారని, భూములు ఇవ్వకపోతే కేసులు పెడతామని రైతులను బెదిరించిన ఘటనలు జరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలను మోసం చేయడం తనకు చేతకాదని, నిజాలు మాత్రమే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు.
ఆరు నెలల్లోనే ఫలితాలు
కేవలం ఆరు నెలల మంత్రిత్వ కాలంలోనే 80 మంది విద్యార్థులను పొలాస అగ్రికల్చర్ కాలేజీకి పంపించామని, పెండింగ్లో ఉన్న రూ.7 కోట్ల బకాయిలను ముఖ్యమంత్రి నాయకత్వంలో చెల్లించామని తెలిపారు. జిల్లాకు చెందిన ఎస్సీ మంత్రిగా దళిత బిడ్డలను గత పాలకులు విస్మరించారని విమర్శించారు. తన రాజీనామాపై చర్చలు చేస్తున్నవారికి ఘాటైన సమాధానం ఇస్తూ, తాను రాజీనామా చేయాలా వద్దా అనేది ధర్మపురి ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.
రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో
గత ప్రభుత్వ అప్పుల వల్ల రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో పడిందని, అయినప్పటికీ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. ధర్మపురి అభివృద్ధి కోసం పాలిటెక్నిక్ కళాశాల, రెవెన్యూ డివిజన్, బస్ డిపో తీసుకువస్తామని చెప్పారు. ట్రైబల్ మినిస్టర్ ద్వారా రూ.60 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకువచ్చామని, వాడవాడ అభివృద్ధికి రూ.3 కోట్లు కేటాయించామని వెల్లడించారు.
మూడేళ్లలో తాను ఇచ్చిన అభివృద్ధి హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విసిరిన సవాల్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జనవరి చివరి వారం వరకు గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ధర్మపురికి కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.


