ఆర్అండ్ఆర్ కాలనీలకు న్యాయం చేయాలి
– బీఆర్ఎస్ యువ నాయకుడు ఎన్సీ సంతోష్
– అభివృద్ధి లేకుండానే ఇంటి పన్ను వసూలు సరికాదు
– మానవతా దృక్పథంతో మినహాయింపు కల్పించాలని డిమాండ్
కాకతీయ, గజ్వేల్ :గజ్వేల్ ఆర్అండ్ఆర్ కాలనీ వాసుల సమస్యలను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించాలని బీఆర్ఎస్ యువ నాయకుడు ఎన్సీ సంతోష్ కోరారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత ఆరు సంవత్సరాలుగా ఆర్అండ్ఆర్ కాలనీ వాసులపై ఇంటి పన్ను చెల్లించాలని మున్సిపల్ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. అయితే కాలనీకి తగిన మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిస్థాయిలో చేపట్టలేదని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో పన్ను వసూలు చేయడం సమంజసం కాదన్నారు. 2026 జనవరి నుంచి మున్సిపాలిటీలో విలీనం చేసినట్లు జారీ చేసిన జీవో ప్రకారం కనీసం ఆ తేదీ నుంచి మాత్రమే పన్ను వసూలు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు కాలనీలకు సంబంధించిన పన్నులను రద్దు చేయాలని కోరారు. లేదంటే మానవతా దృక్పథంతో వచ్చే పది సంవత్సరాలపాటు ఇంటి పన్ను మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్లు, గ్రామాలు, వ్యవసాయ భూములు వదులుకుని పునరావాసంగా వచ్చిన కుటుంబాల త్యాగం ద్వారానే బృహత్తర కాలేశ్వరం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులు నిర్మాణం జరిగాయని గుర్తుచేశారు. అలాంటి కుటుంబాలకు ప్రభుత్వం ప్రత్యేక పరిగణన ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు ప్రజలు, ఆర్అండ్ఆర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.


