జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం
యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి
సఖి సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి
ముందుగానే ప్రాణహాని అంటూ ఫిర్యాదు చేసిన యువకుడు
కులాంతర వివాహమే కారణమనే ఆరోపణలు
కాకతీయ,కరీంనగర్ బ్యూరో : జగిత్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న సఖి సెంటర్ సమీపంలో ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై యువతి బంధువులు కత్తులు, రాళ్లతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. గాయపడిన యువకుడు అనిల్ కుమార్ ప్రస్తుతం జగిత్యాల సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడిలో అతని తల, చేయి, వీపు భాగాల్లో తీవ్ర గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు. యువతి బంధువుల నుంచి ప్రాణహాని ఉందని అనిల్ కుమార్ మల్యాల పోలీస్ స్టేషన్లో ముందుగానే ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ సఖి సెంటర్ వద్దకు వచ్చిన యువతి బంధువులు యువతిని తీసుకెళ్లే ప్రయత్నంలో ఉద్రిక్తత సృష్టించి, యువకుడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
ఐదు రోజులుగా సఖి సెంటర్లో యువతి
ప్రేమ వివాహం అనంతరం యువతి ఐదు రోజులుగా సఖి సెంటర్లో ఉండగా, ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన బంధువులు ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కులాంతర వివాహమే ఈ దాడికి ప్రధాన కారణమని బాధిత యువకుడు, అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు.


