కాకతీయ, తెలంగాణ బ్యూరో: పుణ్యక్షేత్రాలను దర్శించాలని కోరుకునే భక్తుల కోసం ఐఆర్సీటీసీ టూరిజం మరో అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్రత్యేక యాత్రలో అయోధ్య, కాశీ, పూరీ వంటి పవిత్ర ప్రదేశాలతో పాటు బైద్యనాథ్ ధామ్ వంటి ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శనం కూడా ఉంటుంది. అయోధ్య, కాశీ పుణ్యక్షేత్ర యాత్ర విత్ బైద్యనాథ్ ధామ్ అనే పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ యాత్ర 2025 సెప్టెంబర్ 9న ప్రారంభమై మొత్తం 10 రోజులు సాగుతుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్స్ ట్రైన్ స్కీమ్ కింద నడిచే ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ జంక్షన్ నుండి బయలుదేరుతుంది. ప్రయాణికులు కాజీపేట, వరంగల్, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం స్టేషన్ల వద్ద నుంచి కూడా ఎక్కే అవకాశం ఉంటుంది. ఈ రైలులో స్లీపర్ క్లాస్, 3ఏసీ, 2ఏసీ తరగతులు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 639 సీట్లు ఉంటాయి.
మొదటి రెండు రోజుల్లో భక్తులు పూరీ చేరుకుని జగన్నాథ స్వామి దర్శనం చేసుకోగలరు. మూడో రోజు కోణార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శించే అవకాశం ఉంటుంది. నాలుగో రోజు బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగ దర్శనానికి అవకాశం కల్పిస్తారు. ఐదో రోజు వారణాసికి బయలుదేరి ఆరో రోజు కాశీ విశ్వనాథ్ ఆలయం, విశాలాక్షి అమ్మవారి ఆలయం, అన్నపూర్ణ దేవి ఆలయం వంటి ప్రసిద్ధ దేవాలయాలను దర్శించొచ్చు. సాయంత్రం గంగా హారతి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.
తర్వాత అయోధ్యలో శ్రీరామ జన్మభూమి, హనుమాన్ గఢి వంటి పవిత్ర ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ఎనిమిదో రోజు ప్రయాగ్రాజ్ చేరుకుని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభమై, సెప్టెంబర్ 18న యాత్ర సికింద్రాబాద్లో ముగుస్తుంది.
టికెట్ ధరలు కూడా ప్రయాణికుల సామర్థ్యానికి తగ్గట్టే నిర్ణయించారు. స్లీపర్ క్లాస్ ధర రూ.17,000, 3ఏసీకి రూ.26,700, 2ఏసీకి రూ.35,000గా నిర్ణయించారు. వసతి విషయానికొస్తే, ఎకానమీ క్లాస్ వారికి నాన్-ఏసీ గదులు 4-5 మందికి షేరింగ్లో, స్టాండర్డ్ క్లాస్ వారికి 2-3 మందికి నాన్-ఏసీ గదులు, కంఫర్ట్ క్లాస్ వారికి ఏసీ గదులు కేటాయిస్తారు. వాహన సౌకర్యం కూడా క్లాస్ ఆధారంగా ఉంటుంది.
భక్తులకు ప్రతిరోజూ ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందిస్తారు. మొత్తం వెజిటేరియన్ ఆహారం మాత్రమే ఉంటుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్, రైలులో సెక్యూరిటీ, టూర్ మేనేజర్లు వంటి సౌకర్యాలు ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. అయితే ఆలయ ప్రవేశ టికెట్లు, బోటింగ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, గైడ్ ఫీజులు, వ్యక్తిగత ఖర్చులు, లాండ్రీ, మినరల్ వాటర్ ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.భక్తుల సౌకర్యార్థం రైల్వేలు సుమారు 33 శాతం రాయితీ కూడా ఇస్తున్నాయి. ఈ యాత్రలో భాగమై పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించాలనుకునే వారు పూర్తి వివరాల కోసం irctctourism.com వెబ్సైట్ను సందర్శించవచ్చు.


