కాకతీయ, క్రైమ్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తే కాలయముడిగా మారాడు. భార్యకు తిండి పెట్టకుండా..విగత జీవిలా మార్చి హతమార్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే…
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వన్నాథపురం గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్నకు ఖాన్ ఖాన్ పేట్ గ్రామానికి చెందిన పూల నరేశ్ బాబుకు 2015లో వివాహం జరిగింది. మూడేళ్ల నుంచి అశ్వారావుపేటలో ఈ దంపతులు నివాసం ఉంటున్నారు. శనివారం లక్ష్మీ ప్రసన్న మెట్ల మీద నుంచి కిందపడింది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించామని తమ అత్తామామలకు ఫోన్ చేసి చెప్పాడు నరేశ్ బాబు.
ఆసుపత్రికి వెళ్లి ఎముకలు తేలి..దీనస్థితిలో ఉన్న లక్ష్మీ ప్రసన్న డెడ్ బాడీని చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. శరీరం అంతా గాయాలు, పాత గాయాల ఆనవాళ్లు చూసి అనుమానంతో పోలీసుల ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మ్రుతిగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. రెండు సంవత్సరాలుగా తమ కూతురిని గదిలో నిర్బంధించి కనీసం తమను చూడనివ్వలేదని అదనపు కట్నం కోసమే నరేశ్ కుటుంబ తమ కూతురిని హతమార్చారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.


