గజ్వేల్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉచిత కంటి పరీక్షా శిబిరం
– సిద్దిపేట పోలీస్ కమిషనర్ యస్. రష్మీ పెరుమాళ్, ఐపీఎస్
– గజ్వేల్ ఏసిపి నర్సింలు
– హెవీ వాహన డ్రైవర్లకు ప్రత్యేక పరీక్షలు
– ఉచిత అద్దాల పంపిణీ
కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ టౌన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ యస్. రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు గజ్వేల్ ఏసిపి నర్సింలు ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసు విభాగం ప్రత్యేక చొరవతో పోలీసు శాఖ సమన్వయంతో కార్యక్రమం నిర్వహించారు. బస్సులు, లారీలు, ఆటోలు, ఇతర గూడ్స్ వాహనాల డ్రైవర్ల కోసం కంటి పరీక్షలు చేపట్టారు. సిద్దిపేట జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులు విస్తరించి ఉండటంతో రోడ్డు ప్రమాదాల నివారణలో ఈ శిబిరం ఉపయోగకరమని గజ్వేల్ టౌన్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ తెలిపారు. శిబిరంలో పాల్గొన్న డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేశారు. కంటి ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఏసిపి నర్సింలు మాట్లాడుతూ… రోడ్డు భద్రతలో కంటి చూపు కీలకమని అన్నారు. హెవీ వాహన డ్రైవర్లు నిరంతరం కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. డ్రైవర్లు ఆరోగ్యంగా ఉంటేనే ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ టౌన్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి, ఎస్ఐ ప్రేమ్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


