సైన్స్పై మక్కువ పెంచుకోవాలి
ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కాకతీయ, రుద్రంగి: విద్యార్థులు చిన్నతనం నుంచే శాస్త్ర సాంకేతిక రంగాలపై మక్కువ పెంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్, వాణి విద్యాలయంలో సైన్స్ ఫెయిర్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శనలను ఆయన సందర్శించి విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. భవిష్యత్తులో దేశ అభివృద్ధికి శాస్త్ర సాంకేతిక రంగం కీలకమని, చిన్ననాటి నుంచే పరిశోధనా మనస్తత్వం అలవర్చుకోవాలని సూచించారు. శాస్త్రీయ దృక్పథం ప్రతి విద్యార్థి జీవితంలో భాగమవ్వాలని, ప్రశ్నించే స్వభావం పెంపొందించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విద్యార్థులకు డైట్ చార్జీలో కాస్మోటిక్ చార్జీలను పెంచి విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్ద ఉంచుకొని విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకువస్తున్నారని ఆయన తెలిపారు.


