పంచాయతీ కార్మికులకు భరోసా.. 15 లక్షల ప్రమాద బీమా
కాకతీయ, చింతకాని : గ్రామపంచాయతీ కార్మికుల సంక్షేమానికి చింతకాని గ్రామపంచాయతీ ముందడుగు వేసింది. గ్రామంలో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు 15 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించారు. విధి నిర్వహణలో ఎలాంటి ప్రమాదం జరిగినా కార్మికులకు, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ ప్రమాద బీమా అమలులోకి వచ్చింది. విధి నిర్వహణలో ఎదురయ్యే అనుకోని ప్రమాదాల సమయంలో కుటుంబాలకు అండగా ఉండేలా ఈ బీమా ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమంలో చింతకాని సర్పంచ్ కిలారు మనోహర్, గ్రామ సెక్రటరీ రమేష్ బాబు, కోలా నాగేశ్వరావు, పంచాయతీ కార్మిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమమే గ్రామాభివృద్ధికి పునాది అని సర్పంచ్ పేర్కొన్నారు.


