- ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం
- త్వరలో అందుబాటులోకి ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’
- పైలెట్ ప్రాజెక్టుగా అడవి తల్లి బాటకు అనుసంధానం
- సాస్కీ నిధులతో పల్లె పండగ 2.0
- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
కాకతీయ, ఏపీ బ్యూరో : పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలన్నదే తన ముందున్న ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ గారు వెల్లడించారు. తన ప్రతి అడుగూ ఆ దిశగానే ఉంటాయని తెలిపారు. జల్ జీవన్ మిషన్, పల్లె పండగ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పక్కాగా పాటించాలని స్పష్టం చేశారు. పల్లె రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో త్వరలో సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించబోతున్నట్టు తెలిపారు. ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’ ద్వారా గ్రామీణ రోడ్ల పూర్తి సమాచారాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునే సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. సాస్కీ నిధుల సాయంతో పల్లె పండగ 2.0ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పల్లె పండగ 2.0, అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వమిత్ర పథకాలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి పారుదల శాఖ, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
పనుల పురోగతి లేకపోవడంపై డిప్యూటీ సీఎం అసంతృప్తి
నిధులు అందుబాటులో ఉన్నా పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అడవి తల్లిబాట, జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా తక్షణం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రతి పనిని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసేలా ఈ ప్రణాళికలు ఉండాలన్నారు. ఈ మేరకు యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సాస్కి నిధులకు అనుమతుల స్టేటస్ గురించి పవన్ కల్యాణ్ ఆరా తీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూత్రప్రాయంగా ఆమోదించారని, ఆర్థిక శాఖ నుంచి సమ్మతి రావాల్సి ఉందన్నారు. ఈ అంశంపై తక్షణం ఆర్థిక శాఖతో చర్చించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ”రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామీణ రహదారులన్నింటినీ జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టంకు అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. మనం ప్రయాణం చేసే మార్గంలో రోడ్డు ఉందా? లేదా? ఉంటే ఎలా ఉంది? అనే వివరాలు ప్రజల చేతిలో అందుబాటులో ఉండే వ్యవస్థను తీసుకురావాలన్నారు. అసలు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని రహదారులు ఉన్నాయి? అవి ఎలా ఉన్నాయి? అనే వివరాలు కూడా ప్రతి ఒక్కరికీ తెలియాలి. కొత్త రహదారి నిర్మిస్తే అందుకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటలోకి రావాలన్నారు. 48 గంటల్లో అందుకు సంబంధించి ఒక స్పష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం కావాలి. ఒక వర్కింగ్ గ్రూప్ రూపొందించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందులో పొందుపరచాలని సూచించారు.
డవి తల్లిబాటపై అలసత్వం వద్దు
గిరిజన గ్రామాల్లో చేపట్టిన అడవి తల్లిబాట పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి కనబడడం లేదని పవన్ అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సాయం మొత్తం కలిపి రూ.1,158 కోట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 761 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 662 రహదారులు నిర్మించాలన్న సంకల్పంతో పనులు ప్రారంభించాం. అడవి తల్లిబాట పనులను వేగవంతం చేయండి. ఎక్కడైనా అటవీ శాఖతోగాని, ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తక్షణం పరిష్కరించుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోండంటూ సూచించారు. తక్షణం పల్లె పండగ 2.0ని పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు చేయాలి. రూ.2,123 కోట్ల సాస్కీ నిధులతో పల్లెల్లో 4007 కిలోమీటర్ల మేర రహదారులు, గోకులాలు, మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ శ్రీ కృష్ణ తేజ, సర్వే విభాగం కార్యదర్శి శ్రీ కూర్మనాథ్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన చీఫ్ ఇంజినీర్ శ్రీ బాలూ నాయక్, శ్రీమతి గాయత్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


