కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఏపీలోకి కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. దీంతో పెద్దెత్తున మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకుని ఆరుగురు సజీవదహనం అయ్యారు. మరికొందరికి గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అనపర్తి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో 40 మంది కార్మికులు అందులో పనిచేస్తున్నట్లు తెలిపారు. భారీ పేలుడు ధాటికి బాణసంచా తయారీ కేంద్రం షెడ్డు గోడ కూలింది. శిథిలాల కింద మరికొందరు ఉండవచ్చని సమాచారం. ఘటనాస్థలానికి రామచంద్రపురం ఆర్డీవో అఖిల పరిశీలించారు.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ స్పందించారు. వారం క్రితం బాణసంచా తయారీ కేంద్రాన్ని స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పరిశీలించి అన్ని రక్షణ చర్యలు ఉన్నట్లు నివేదిక తెలిపారు. అగ్నిప్రమాద నివారణ పరికరాలను గోదాము యజమానులు సక్రమంగా వినియోగించారా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని తెలిపారు.
బాణసంచా పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై అధికారులతో ఆయన మాట్లాడి ప్రమాదంలో పలువురు మరణించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుత పరిస్థితి, సహాయకచర్యలు, వైద్యసాయంపై వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఘటనాస్థలానికి వెళ్లి సహాయకచర్యల్లో పాల్గొనాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ, అగ్నిమాపక శాఖ అధికారులతో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి తెలిపారు.


