ఓబీసీ సాధనమే మా లక్ష్యం..!
ఆరె కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి
చట్టసభల్లో ప్రాతినిధ్యం కోసం ఐక్యత నాయకత్వం అవసరం
వరంగల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ
జిల్లా నూతన అధ్యక్షుడిగా ఓలిగే నర్సింగరావు ఏకగ్రీవ ఎన్నిక
కాకతీయ, దుగ్గొండి : ఓబీసీ సాధన లక్ష్యంగా ఆరె కులస్తులు ఐక్యంగా ముందుకు సాగాలని ఆరెకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నీబావిలో నిర్వహించిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి నివాళులు అర్పించారు. రాజకీయ, విద్య, వైద్య, ఆర్థిక రంగాల్లో ఆరె కులస్తులు రాణించాలని, చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల హక్కులు కోల్పోతున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఇరవై రెండు జిల్లాల్లో పోటీ చేసి గెలుపొందామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత శాతం ఆరె కులస్తులు విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆరె కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చే దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
జిల్లా అధ్యక్షుడిగా నర్సింగరావు
ఈ సందర్భంగా ఆరె కుల సంఘం వరంగల్ జిల్లా నూతన అధ్యక్షుడిగా దుగ్గొండి మండలం రేఖంపల్లి గ్రామానికి చెందిన ఓలిగే నర్సింగరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పదమూడు మండలాల అధ్యక్షులు ఆయన పేరును ఆమోదించారు. నర్సింగరావు మాట్లాడుతూ కులబాంధవుల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ రాష్ట్ర నాయకత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సుఖినే రాజేశ్వర్ రావు, జిల్లా గౌరవ అధ్యక్షుడిగా గుండెకారి రవికుమార్, మండల అధ్యక్షుడిగా మడతలపాటి కుమార్ ఎన్నికయ్యారు. సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేశ్వరరావు, ఉద్యమ కమిటీ చైర్మన్ సోమిడి అంజన్ రావు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


