మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్..!
శాశ్వత నిర్మాణాలకు ప్రాధాన్యం
జంపన్న వాగులో ఏడాది పొడవునా నీరు
ఐదు చెక్ డ్యామ్లకు ప్రణాళిక
అడవి రహదారుల విస్తరణకు కేంద్ర అనుమతుల ప్రక్రియ
మంత్రులు పొంగులేటి, సీతక్క
జాతర అనంతరం మంత్రుల సమీక్ష
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ పుణ్యక్షేత్రంలో జాతర అభివృద్ధి పనులపై రాష్ట్ర మంత్రులు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వనదేవతలను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గద్దెల పరిసరాల్లో చేపట్టిన రాతి నిర్మాణాలు, ప్రహరీ గోడలు, శిల్పాలు, డ్రైనేజీ వ్యవస్థ, గ్రిల్స్, ఫ్లోరింగ్ తదితర పనులను పరిశీలించారు.
జాతరను తాత్కాలిక ఏర్పాట్లతో కాకుండా భవిష్యత్తు తరాలకు కనీసం రెండు వందల సంవత్సరాలు నిలిచేలా రాతి కట్టడాలతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. జాతర నాలుగు రోజుల పాటు విజయవంతంగా జరిగి సుమారు ఒక కోటి ఇరవై లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యారని చెప్పారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
జంపన్న వాగు అభివృద్ధి
మేడారం అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జంపన్న వాగులో ఏడాది పొడవునా నీరు ఉండేలా గోదావరి జలాలను తీసుకురావడం, ఐదు చెక్ డ్యామ్లు నిర్మించడం ప్రణాళికలో భాగమని వెల్లడించారు. సమీపంలోని సాగునీటి చెరువులను సుందరీకరించనున్నట్లు చెప్పారు. జాతర సమయంలో వాహనాల రద్దీ దృష్ట్యా అడవిలోని రహదారులను విస్తరించేందుకు కేంద్ర అనుమతులు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నామని, అవసరమైతే మరింత భూమి సేకరిస్తామని తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ జాతర అనంతరం సమీక్ష నిర్వహించడం అరుదని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మేడారాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.



