శాంతియుతంగా కొమ్మాల జాతరను విజయవంతం చేయాలి….
*రాజకీయ పార్టీ నాయకుల సమీక్ష సమావేశంలో వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్
కాకతీయ,గీసుగొండ: రానున్న శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతర సందర్భంగా గీసుగొండ, దుగ్గొండి,నర్సంపేట మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు,వివిధ రాజకీయ పార్టీల నాయకులతో వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డీసీపీ అంకిత్ కుమార్ మాట్లాడుతూ…జాతరలో పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసి స్వస్థలాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.హోళీ రోజు నిర్వహించబడే ప్రభ బండ్ల శోభాయాత్రలకు సంబంధించి పాటించవలసిన విధి విధానాలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, రహదారుల వినియోగం వంటి అంశాలపై స్పష్టమైన మార్గ దర్శకాలు జారీ చేశారు. రోడ్లపై వెళ్తున్న వాహన దారులకు, దర్శనానికి వచ్చే భక్తులకు, నర్సంపేట నుండి వరంగల్ వైపు ప్రయాణించే వారికి ఎలాంటి ఆటంకం కలగకుండా ర్యాలీలు నిర్వహించు కోవాలని తెలిపారు. నియమ నిబంధనలు పాటించ నట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ రాతపూర్వక నోటీసులు జారీ చేశారు.ఈ సందర్భంగా రాజకీయ పార్టీ నాయకులు పోలీస్, రెవెన్యూ శాఖల సూచనలు తప్పకుండా పాటిస్తూ ఎలాంటి ఘర్షణలు లేకుండా శాంతియుత వాతావరణంలో జాతరను విజయవంతం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో ఏసిపి మామునూరు వెంకటేష్,ఏసిపి నర్సంపేట రవీందర్ రెడ్డి,ఇన్స్పెక్టర్లు గీసుగొండ విశ్వేశ్వర్,దుగ్గొండి సాయి రమణ,నర్సంపేట శ్రీనివాస్, గీసుగొండ తహసీల్దార్ రియాజుద్దీన్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.



