దానం చేసిన భూమిని లాక్కునే హక్కు ఎవరిచ్చారు?
వెలుగుమట్లలో మిగిలిన ముప్పై ఎకరాల భూమి ఏమైంది..?
ఎవరు కబ్జా చేశారు..? ఎవరు కలుపుకున్నారు..?
ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి
పేద ప్రజలకు సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలి..!
కూల్చివేతలకే పరిమితమైన రేవంత్ రెడ్డి పాలన
మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆగ్రహం
బాధితులకు బాసటగా నిలిచిన బీజేపీ నేతలు
అంబేద్కర్ భవనంలో కన్నీటి ఘోష…
స్వయంగా పేదలకు భోజనం వడ్డించిన ఈటల
కాకతీయ, ఖమ్మం బ్యూరో: నిరుపేదలకు దానం చేసిన భూమిని దౌర్జన్యంగా లాక్కునే హక్కు కాంగ్రెస్ పాలకులకు ఎవరిచ్చారని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అరవై రెండు ఎకరాల భూదాన్ భూమిలో ముప్పై రెండు ఎకరాల్లో పేదలు నివసిస్తుంటే అమానుషంగా కూల్చివేసిన అధికార పక్షం, మిగిలిన ముప్పై ఎకరాలు ఎవరి చేతుల్లో ఉన్నాయో తక్షణమే వెల్లడించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని గట్టిగా నిలదీశారు. శనివారం ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవనంలో తలదాచుకుంటున్న భూదాన్ బాధితులను ఈటల రాజేందర్ పరామర్శించారు. నిలువనీడ కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న వారికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భోజన సదుపాయం కల్పించారు. స్వయంగా బాధితులకు భోజనం వడ్డిస్తూ వారి ఆవేదనను ఆత్మీయంగా విన్నారు. ఈ కష్టకాలంలో పేదల పక్షాన పార్టీ నిరంతరం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. గత ఐదు రోజులుగా వెలుగుమట్ల ప్రాంతంలో అమాయక ప్రజల కన్నీళ్లతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. గుడిసెలు కూలిపోవడంతో రోడ్డున పడిన పేదలు ప్రభుత్వంపై ఆగ్రహంతో శాపనార్థాలు పెడుతున్నారని అన్నారు. ఖమ్మం జిల్లాలో అధికార పక్షానికి భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజలే నేడు దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
భూదాన్ భూమి స్వరూపమేంటి?
భూదాన్ భూమి అంటేనే నిరుపేదలకు దానం చేసిన భూమి అని పాలకులకు స్పృహ లేదా అని ఈటల ప్రశ్నించారు. వినోబా భావే ప్రారంభించిన భూదాన్ ఉద్యమం ద్వారా వేలాది ఎకరాలు పేదలకు దానం అయ్యాయని గుర్తుచేశారు. సర్వే నంబర్లు 147, 148, 149ల్లో కలిపి 62 ఎకరాల భూదాన్ భూమి ఉందని వివరించారు. ఆ భూములను ఏళ్ల తరబడి ఎవరూ పట్టించుకోలేదని, కానీ భూముల ధరలు పెరగడంతో బడాబాబుల కన్ను ఆ ప్రాంతంపై పడిందని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వ పాలన కూల్చివేతలకే పరిమితమైందని ధ్వజమెత్తారు. నిరుపేదలకు భూములు పంచడం చేతకాని ప్రభుత్వం ఉన్న భూములను కబ్జా చేయడంలోనే దిట్టగా మారిందని విమర్శించారు. రెండు వేల పంతొమ్మిదిలో న్యాయమూర్తి చల్లా కోదండరాం పేదలకు కనీస వసతులు కల్పించాలని ఆదేశించినా అమలు కాలేదని, ఇప్పుడు అయితే ఉన్న ఇళ్లనే కూల్చివేశారని మండిపడ్డారు.
మిగిలిన ముప్పై ఎకరాల లెక్క చెప్పాలి
ఏ న్యాయస్థానం ఇళ్లు కూల్చమని ఆదేశించిందని ఈటల ప్రశ్నించారు. పేదల గుడిసెలు కూల్చిన పాలకులకు, బడాబాబుల వద్ద ఉన్న వందల ఎకరాల భూములను వెనక్కి తీసుకునే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. అరవై రెండు ఎకరాల్లో ముప్పై రెండు ఎకరాల్లో పేదలు నివసిస్తుంటే దాన్ని లాక్కున్నారని, మిగిలిన ముప్పై ఎకరాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయో జిల్లా పాలనాధికారి వివరించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న భూదాన్ భూముల పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. పేదల ఆవాసాలను కూల్చివేసినందుకు ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని పునరుద్ఘాటించారు. కూల్చిన చోటే ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల ఆగ్రహ జ్వాలల్లో ప్రభుత్వం మాడిమస్సైపోవడం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, గల్లా సత్యనారాయణ, శీలం పాపారావు, దొంగల సత్యనారాయణ, మందడపు సుబ్బారావు, గుత్తా వెంకటేశ్వర్లు, వీరవల్లి రాజేష్, బండారు నరేష్, నున్న రవికుమార్, విజయరాజు, కుమిలి శ్రీనివాస్, రవి రాథోడ్, శ్యామ్ రాథోడ్, ఏలూరి నాగేశ్వరరావు, కందుల శ్రీకృష్ణ, మందా సరస్వతి, మనీ, నకిరేకంటి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.


