కమ్మెర ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలి
– నిందితులపై తక్షణ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్
– పసిపాప మృతి ప్రభుత్వానికి మరణ శాసనం అంటూ ఆగ్రహం
– చర్యలు లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం
– ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు బుడిగే మహేష్
కాకతీయ, గజ్వేల్ :నాగర్ కర్నూల్ జిల్లా కమ్మెర గ్రామంలో చోటుచేసుకున్న ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కుల వివక్షతో రజక కులానికి చెందిన చంద్రకళ ఆమె రెండు నెలల పసిపాపపై దాడి జరిగి పసిపాప మరణించిందని అన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని కోరారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లాలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు బుడిగే మహేష్ మాట్లాడుతూ… ఈ ఘటనకు కారణమైన ముత్యం రెడ్డి, తుకారాం రెడ్డి, ఉండ్యాల శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కన్నిరెడ్డి సతీష్ రెడ్డి, కూపెందర్ రెడ్డి తదితరులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కమ్మెర పసిపాప మరణం రాష్ట్ర ప్రభుత్వానికి మరణ శాసనం వంటిదని, ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కర్ల రాజేష్ నిర్బంధ మృతి నుంచి కమ్మెర ఘటన వరకు దళితులు, బడుగు బలహీన వర్గాలపై దాడులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారి, స్థానిక శాసనసభ్యులు వెంటనే స్పందించి చట్టబద్ధ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే మందా కృష్ణ మాదిగ నాయకత్వంలో వివిధ ప్రజాసంఘాలతో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు మండల అధ్యక్షుడు ఆదాస్ మహేష్, మండల ప్రధాన కార్యదర్శి కొమ్ము వినోద్ కుమార్, మండల ఉపాధ్యక్షుడు కొల్తూరు మల్లేష్, కొక్కొండ గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు నర్సింగరావు, బస్వాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


