కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న శ్యామలకు రూ.20 వేల ఆర్థిక సహాయం
– ఆపన్న హస్త మిత్ర బృందం 120వ సేవా కార్యక్రమం
– మందుల ఖర్చుల కోసం నగదు అందజేత
– దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి
కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ పట్టణం ఆపన్న హస్త మిత్ర బృందం కార్యాలయం వద్ద బృందం 120వ సేవా కార్యక్రమం నిర్వహించారు. కిడ్నీ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న మహిళకు మందుల ఖర్చుల కోసం రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన చుంచనకోట శ్యామల (40)కు పదేళ్ల క్రితం రెండు కిడ్నీలు పనిచేయకుండా పోయాయి. ఆమె భర్త ఎల్లాగౌడ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ చికిత్స చేయించారు. రెండేళ్లకు పైగా డయాలసిస్ చేయించగా, కుటుంబంపై భారీ భారం పడింది. 2020లో శ్యామల తల్లి నర్సమ్మ కిడ్నీ దానం చేయడంతో మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఇందుకోసం కుటుంబానికి ఉన్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో ఎకరన్నర అమ్మకానికి పెట్టి చికిత్స ఖర్చులు తీర్చారు. ప్రస్తుతం శ్యామల ఒకే కిడ్నీతో జీవనం సాగిస్తోంది. ప్రతినెలా మందుల కోసం సుమారు రూ.30 వేల వరకు ఖర్చవుతుండటంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది అన్ని తెలిపారు. ఇటీవల మందులు సమయానికి అందక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మళ్లీ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. మిగిలిన అర ఎకరం భూమి చెరువు నీటిలో మునిగిపోతుండటంతో విక్రయించలేని పరిస్థితి నెలకొంది. గ్రామంలోని పెంకుటిల్లు దెబ్బతినడంతో ప్రస్తుతం అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వారి దయనీయ పరిస్థితి తెలుసుకున్న ఆపన్న హస్త మిత్ర బృందం అధ్యక్షుడు పాశికంటి బాలచంద్రం ఆధ్వర్యంలో రూ.20 వేల నగదు అందజేశారు. మరెవరైనా సహాయం చేయాలనుకుంటే 9346255858, 6300077903 నంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పాశికంటి బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటుకం శ్రీనివాస్, కోశాధికారి కొల్లూరి శ్యాం ప్రసాద్, ఉపాధ్యక్షుడు కొలిచెల్మే స్వామి, సభ్యులు రాణి, రాజు, మహేష్, శ్రీకాంత్, రాంరెడ్డి, విజయ్, బిక్షపతి, ధనరాజ్, కరుణాకర్, వెంకటేష్, మంగలి సాయి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


