ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధికారుల తనిఖీలు
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్
సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలు
కాకతీయ, మణుగూరు : మణుగూరు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల పనితీరును జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయా అనే అంశాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. తనిఖీల్లో భాగంగా స్ప్రింగ్ ప్రసూతి ఆసుపత్రిని సందర్శించి గర్భిణీలకు సంబంధించిన ఎఫ్-ఫారమ్ రికార్డులను పరిశీలించారు. రికార్డుల నిర్వహణ పద్ధతిని తనిఖీ చేసి, గర్భిణీలకు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని వైద్యులకు సూచించారు. సాధారణ ప్రసవాల ప్రయోజనాలపై అవగాహన కల్పించే సమాచారాన్ని ఆసుపత్రుల్లో స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. అనంతరం సాయి మమతా జనరల్ ఆసుపత్రిని సందర్శించి చికిత్సల నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు, సిబ్బంది అందుబాటు తదితర అంశాలను పరిశీలించారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, ప్రజలకు నైతిక విలువలతో కూడిన వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని డాక్టర్ తుకారం రాథోడ్ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో మణుగూరు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ నిశాంత్ రావు, జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ అధికారి వెంకటేశ్వర్లు, ఆరోగ్య విద్యాధికారి పరంగని తదితరులు పాల్గొన్నారు.


