మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి
కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు
ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్
పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీ ఆందోళన
బీజేపీ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు
కాకతీయ, నేషనల్ డెస్క్: రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. జో ఉచిత్ సమ్జో వహీ కరో (మీరు సరైనది అనుకున్నది చేయండి) అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీలు శుక్రవారం ఉదయం చేపట్టిన నిరసనలో పాల్గొన్న రాహుల్, ఈ మేరకు పలు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఉదయం పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జో ఉచిత్ సమ్జో వహీ కరో అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన కొనసాగించారు. భారత్, అమెరికా డీల్ను ట్రాప్ డీల్గా వర్ణిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆ సమయంలో వారితోపాటు రాహుల్ గాంధీ కూడా పాల్గొని నినాదాలు చేశారు. అప్పుడే మీడియాతో మాట్లాడుతూ, జో ఉచిత్ సమ్జో వహీ కరో అంటూ విమర్శించారు.
అబద్ధాలను పదేపదే చెప్పడం ఆయన అలవాటే: ఖర్గే
అదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా మోదీ ప్రసంగం తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని, ప్రతిపక్షం లేవనెత్తిన కీలక అంశాలకు ప్రధాని సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారని ఆరోపించారు. ప్రధాని ప్రసంగ సమయంలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. జాతీయ భద్రత, చైనా అంశాలపై తమ ఆందోళనలకు సరైన సమాధానం రాలేదనే కారణంతో సభను బహిష్కరించామని ఖర్గే తెలిపారు.
“ప్రధాని ప్రసంగానికి స్పందించాల్సిన అవసరం లేదు. కానీ ఆయన చెప్పిన అసత్యాలకు సమాధానం ఇవ్వాల్సి వస్తోంది. అబద్ధాలను పదేపదే చెప్పడం ఆయన అలవాటైపోయింది” అని ఖర్గే విమర్శించారు. 97 నిమిషాల ప్రసంగంలో ప్రధాని గత 100 ఏళ్లు, 75 ఏళ్లు, 50 ఏళ్ల చరిత్ర గురించి మాత్రమే మాట్లాడారని, కానీ ప్రస్తుత సమస్యలపై స్పష్టత ఇవ్వలేదన్నారు. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవాణే రాసిన స్మృతిగ్రంథం (మెమోయర్) అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వం సభను తప్పుదోవ పట్టించిందని ఖర్గే ఆరోపించారు.
ప్రధాని ప్రసంగం అంతా అసత్యాలతోనే! జైరాం రమేష్
అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ కూడా ప్రధాని ప్రసంగంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యసభలో ప్రతిపక్షం లేవనెత్తిన కీలక అంశాలకు ప్రధాని సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు. “ప్రధాని ప్రసంగం అసత్యాలతో, అసహనంతో నిండి ఉంది. 97 నిమిషాల ప్రసంగం నిరాశాజనకం” అంటూ ఎక్స్ వేదికగా స్పందించారు. అంతర్జాతీయ అంశాలపై కూడా కేంద్ర ప్రభుత్వం మౌనం పాటిస్తోందని రమశ్ ఆరోపించారు. భారత్- పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం చేశానని చేసిన వ్యాఖ్యలపై ప్రధాని స్పందించలేదని ప్రశ్నించారు. అలాగే చైనా అంశంలో కూడా స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు.


