లడ్డూ కల్తీ దోషులను వదిలిపెట్టం
నిజాలు దాచితేనే మహాపాపం
ప్రజల దృష్టికి తీసుకెళ్లడం తప్పా?
భక్తుల మనోభావాలతో చెలగాటం
సీఎం చంద్రబాబు
కాకతీయ, ఏపీ బ్యూరో : తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై కూటమి నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం తమ బాధ్యత అని, నిజాలు బయటపెట్టకపోతేనే తప్పు అవుతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ఆలయాల చుట్టూ జరిగిన ప్రతి అవకతవకను అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యంగా తీసుకుందని, అన్నీ “పిచ్చోళ్లపనే” అన్నట్లు వ్యవహరించిందని మండిపడ్డారు. ఎన్డీడీబీ (NDDB) నివేదికను సీఎం చంద్రబాబు తమకు పూర్తిగా వివరించారని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆ నివేదిక ప్రకారం తిరుమల లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో బీఫ్ కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ లాంటి అనారోగ్యకర పదార్థాలు ఉన్నట్లు స్పష్టంగా తేలిందని పేర్కొన్నారు. ఇది సామాన్య విషయం కాదని, కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు.
భక్తుల మనోభావాలతో చెలగాటం
ఈ వ్యవహారంపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు, ఎన్డీడీబీ నివేదికలో నెయ్యి నాణ్యతపై తీవ్రమైన లోపాలు ఉన్నట్లు స్పష్టంగా పేర్కొనబడిందన్నారు. సీబీఐ నివేదికలో ఎక్కడా కల్తీ జరగలేదని చెప్పలేదని, కేవలం విచారణ అంశాలే ఉన్నాయని తెలిపారు. వైసీపీ పాలనలో తిరుమల రావాలన్నా, లడ్డూ తినాలన్నా భక్తులు భయపడే పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో క్షమాపణలు తాము చెప్పాల్సిన అవసరం లేదని, దూషణలు భరించాల్సిన అవసరమూ లేదని తేల్చిచెప్పారు. దోషులను కచ్చితంగా శిక్షిస్తామని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ అంశంలో తమపై వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అసభ్య పదజాలంతో విమర్శలు చేయడం దారుణమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఆర్థిక లాభాల కోసం జరిగిన వ్యవహారం కాదని, దేవుడ్ని అపవిత్రం చేసే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. తాము నిమిత్తమాత్రులమేనని, చివరికి దేవుడే దీనికి తగిన శిక్ష విధిస్తాడని సీఎం వ్యాఖ్యానించారు. లడ్డూ కల్తీ అంశం రాజకీయాలకు అతీతమైందని, ఇది కోట్లాది భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయమని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే స్వరంతో స్పష్టం చేశారు.


