- రాబోయే టెక్నాలజీకి తగినట్లుగా విద్యార్థులను సిద్దం చేసేలా ఏటీసీలు
- రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
- ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 4 ఏటీసీల ఏర్పాటు
- ఖమ్మం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి తుమ్మల
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : రాబోయే టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులను సిద్దం చేసేలా ఏ.టి.సి.ని ఏర్పాటు చేశామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. మంత్రి సోమవారం ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ఐటిఐ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దక్కాలంటే రొటీన్ గా ఉన్న ఐటిఐ కోర్సులు కాకుండా ప్రస్తుత పరిశ్రమల అవసరాల ప్రకారం నైపుణ్య కోర్సులను డిజైన్ చేయించి ఆధునిక సాంకేతిక కేంద్రాల ద్వారా అందిస్తున్నారని అన్నారు. రాబోయే ఐదు నుంచి పదేళ్ల వరకు ప్రపంచీకరణలో జరిగే మార్పులకు అనుగుణంగా ఏటీసీ కోర్సులు డిజైన్ చేశారని అన్నారు.
మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా మన యువతను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక సాంకేతిక కేంద్రంలో అందించే కోర్సులను పూర్తి చేసే ముందే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించేలా టాటా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని అన్నారు. నిర్వీర్యమైన ఐటీఐలను యువతకు ఉపయోగపడే విధంగా ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం తీర్చిదిద్దిందని అన్నారు. రేవంత్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కు ప్రాధాన్యత కల్పించారన్నారు. నిరుద్యోగ యువతకు మంచి నైపుణ్యాలు అందించాలనే లక్ష్యంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఖమ్మం, మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాలలో నాలుగు ఏ.టి.సి.లను ఏర్పాటు చేశారని తెలిపారు. ఇంజనీరింగ్ కోర్సుల కన్నా మెరుగైన నైపుణ్య కోర్సులు ఏటీసీలో అందుబాటులో ఉన్నాయని, వీటిని విద్యార్థులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని, భవిష్యత్తు పరిశ్రమల డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఏ.టి.సి. కోర్సులను ప్రభుత్వం డిజైన్ చేసిందని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఫాక్స్ కాన్ ఇయిర్ పాడ్స్ ఉత్పత్తి పరిశ్రమ ఉందని, మన ఏ.టీ.సి. లో రోబోటిక్స్ పూర్తిచేసే విద్యార్థులకు అటువంటి పరిశ్రమలో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. సీపీ సునీల్ దత్ మాట్లాడుతూ దేశంలో స్కిల్ గ్యాప్ బాగా ఉందని, విద్యార్థులు చేసే కోర్సులకు, బయట పరిశ్రమల అవసరాలకు చాలా తేడాలు ఉన్నాయని గమనించిన ప్రభుత్వం ప్రైవేటు సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఏటీసీ సెంటర్ లను ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి మన రాష్ట్రంలో పెరుగుతుందని, ఈ రంగం వైపు యువత దృష్టి సారించాలని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఏటిసి ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాస చారి, ఆర్ అండ్ డీ ఎస్ఈ యాకోబు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, కార్మిక శాఖ సహాయ కమిషనర్ కృష్ణవేణి, కార్పొరేటర్ సత్యనారాయణ, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ సైదులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


