ఆరు గ్యారెంటీల మాటేమైంది?
కాంగ్రెస్కు ఓట్లు అడిగే హక్కు లేదు
మధిరలో మూడు స్థానాల్లో సీపీఎం పోటీ
సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు
కాకతీయ, బోనకల్ : మోసపూరిత హామీలతో, మాయమాటలతో ఆరు గ్యారెంటీ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు తీవ్రంగా విమర్శించారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదన్నారు.
బోనకల్ మండల కేంద్రంలోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో మంగళవారం జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జొన్నలగడ్డ సునీత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గోపాలరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను హరించేలా ఉన్నాయని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మతోన్మాద విధానాలు అవలంబిస్తూ పెట్టుబడిదారులకు మేలు చేసి, పేద ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తోందన్నారు.
ఈ నెల పన్నెండవ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అన్ని రంగాల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని, మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని ఓటర్లను కోరారు.
మధిర మున్సిపాలిటీలో సీపీఎం, బీఆర్ఎస్ పొత్తుతో మూడు స్థానాల్లో సీపీఎం పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ స్థానాల్లో సీపీఎం అభ్యర్థులను గెలిపిస్తేనే పేదలకు నిజమైన న్యాయం జరుగుతుందని అన్నారు. మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికార దాహంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఈ సమావేశంలో సీపీఎం జిల్లా సీనియర్ నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి కిలారు సురేష్, నాయకులు పెద్దపోలు రామారావు, గుడ్డూరి వెంకటనరసయ్య, ఉప్పర శ్రీను, పసుపులేటి నరేష్, బంధం శ్రీనివాసరావు, నల్లమోతు వాణి, తెల్లాకుల శ్రీనివాసరావు, తాత వీరయ్య తదితరులు పాల్గొన్నారు.


