దోమలపై యుద్ధం.. గోవిందపురంలో ఫాగింగ్ ముమ్మరం
కాకతీయ, బోనకల్ : దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు గోవిందపురం గ్రామంలో గ్రామ పంచాయతీ యంత్రాంగం చర్యలు వేగవంతం చేసింది. సర్పంచ్ మంద కరుణ, ఉప సర్పంచ్ కారంగుల చంద్రయ్య ఆధ్వర్యంలో గురువారం గ్రామంలోని వీధులు, కాలనీల్లో విస్తృతంగా ఫాగింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మంద కరుణ మాట్లాడుతూ గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అత్యంత అవసరమని సూచించారు. ఇటీవల దోమల బెడద పెరుగుతున్న నేపథ్యంలో గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గ్రామంలో దోమల పెరుగుదలను నియంత్రించేందుకు ప్రతి వీధిలో ఫాగింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అదనంగా గ్రామంలోని కాలనీలు, చెత్త పేరుకుపోయే ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజలు నిల్వ నీరు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, శుభ్రత పాటిస్తే దోమల వల్ల వచ్చే వ్యాధులను నివారించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కే. మురళి, తమ్మారపు లక్ష్మణ్, కళ్యాణపు శ్రీనివాసరావు, పంచాయతీ గుమస్తా హెచ్చు బాసు, ఏసుపోగు ప్రకాశం, డేగల లాజర్, మంద వెంకయ్యతో పాటు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.


