సీల్డ్ కవర్ తెరుచుకోగానే సుజాతరామనాథం పేరు…
మధిర మున్సిపల్ చైర్మన్గా సామినేని సుజాతరామనాథం ఎంపిక
ముగ్గురు ఆశావహుల్లో చివరి వరకు కొనసాగిన ఉత్కంఠ
కాంగ్రెస్ అధిష్టానం సీల్డ్ కవర్తో ప్రకటించిన నిర్ణయం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణయానికి నాయకుల స్వాగతం
మిగతా అభ్యర్థుల నుంచి పూర్తి మద్దతు… ఐక్యతకు సంకేతం
మధిర అభివృద్ధే లక్ష్యం అని నూతన చైర్మన్ స్పష్టం
కాకతీయ, ఖమ్మం బ్యూరో : మధిర మున్సిపాలిటీ చైర్మన్ పదవికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీల్డ్ కవర్ ద్వారా సామినేని సుజాతరామనాథం పేరును ఖరారు చేసింది. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ పదవిపై తీవ్ర ఉత్కంఠ నెలకొనగా, చివరకు అధిష్టానం ఈ నిర్ణయంతో సస్పెన్స్కు తెరదించింది. మధిర మున్సిపల్ చైర్మన్ పదవికి కాంగ్రెస్ నుంచి వేమిరెడ్డి లక్ష్మీ తులసీ, రంగా రూపా, సామినేని సుజాతరామనాథం పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఈ ముగ్గురూ బలమైన అభ్యర్థులుగా నిలవడంతో పార్టీ అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందన్న దానిపై చివరి వరకు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. స్థానిక సమీకరణాలు, పార్టీ బలం, సామాజిక వర్గాల సమతుల్యతను పరిగణనలోకి తీసుకుని అధిష్టానం చివరకు సామినేని సుజాతరామనాథం వైపు మొగ్గు చూపింది.
సీల్డ్ కవర్తో ప్రకటించిన అధిష్టానం
కాంగ్రెస్ అధిష్టానం సీల్డ్ కవర్లో ఉన్న పేరును అధికారికంగా ప్రకటిస్తూ సామినేని సుజాతరామనాథాన్ని మధిర మున్సిపాలిటీ చైర్మన్గా ఎంపిక చేసింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన సుజాతరామనాథం ఎంపిక రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నిర్ణయంతో చైర్మన్ పదవిపై కొనసాగిన అనిశ్చితి పూర్తిగా తొలగిపోయింది. చైర్మన్ పదవికి పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులు కూడా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ సామినేని సుజాతరామనాథానికి అభినందనలు తెలిపారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతించారు. మధిర అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
అభివృద్ధే లక్ష్యం : సుజాతరామనాథం
ఈ సందర్భంగా సామినేని సుజాతరామనాథం మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి చైర్మన్ పదవిని అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. తన విజయంలో కీలక పాత్ర పోషించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మధిర మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని స్పష్టం చేశారు. మధిర మున్సిపల్ పీఠం కాంగ్రెస్ ఖాతాలో చేరడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.


