ఒకే ఇంటికి రెండు నెంబర్లు!
ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలంటే అడ్డంకి
ఇద్దరికి ఒకే ఇంటి నెంబర్ కేటాయింపుపై ప్రశ్నలు
రెండుసార్లు విచారణ చేసినా మారని రికార్డులు
ఉన్నతాధికారుల ఆదేశాలకూ లెక్కలేదన్న ఆరోపణలు
ఖమ్మం కార్పోరేషన్ అధికారుల విచిత్రాలు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. ఒకే ఇంటికి రెండు నెంబర్లు కేటాయించిన ఘటన ప్రస్తుతం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకోవాలనుకున్న ఓ మహిళకు అధికారుల తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నగరంలోని ప్రకాష్ నగర్కు చెందిన కరుణ అనే మహిళ తన పాత ఇంటిని తొలగించి, అదే స్థలంలో ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకునేందుకు దరఖాస్తు చేసుకుంది. అయితే ఆమెకు కేటాయించిన ఇంటి నెంబర్ 4-8-111/9 ను అదే ప్రాంతంలోని మరో ఇంటికి కూడా కేటాయించినట్లు బయటపడింది. దీంతో అధికారిక రికార్డుల్లో ఒకే నెంబర్ రెండు ఇళ్లకు ఉండటం అనేక సందేహాలకు తావిస్తోంది.

డబ్బులు లేవు.. నెంబర్ సమస్యలు
తాను ఆర్థిక ఇబ్బందులతో ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుంటే, ఎంక్వయిరీకి వచ్చిన అధికారుల ద్వారానే ఈ గందరగోళం తెలిసిందని కరుణ వాపోయింది. ఇంటి నెంబర్ ఒకేలా ఉండటంతో లోన్, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో అడ్డంకులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు బై నెంబర్ కేటాయించి, ఇంటి పన్ను చెల్లించే అవకాశం కల్పించాలని పలుమార్లు మున్సిపాలిటీ రెవెన్యూ సిబ్బందిని కోరినా స్పందన లేదని ఆరోపించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిగినప్పటికీ, అధికారులు ఇంటి నెంబర్ సరిచేయలేదని కరుణ తెలిపింది. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా, క్షేత్రస్థాయిలోని రెవెన్యూ సిబ్బంది మాత్రం అలసత్వంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం శూన్యం
బై నెంబర్ కోసం దరఖాస్తు చేసి దాదాపు 20 రోజులుగా మున్సిపాలిటీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాధుడే లేడని కరుణ వాపోయింది. సామాన్య ప్రజల సమస్యలపై అధికారులు స్పందించడం లేదని, తమ నిర్లక్ష్యం వల్ల తాను పొందాల్సిన లోన్లు, ప్రభుత్వ ప్రయోజనాలు అందడం లేదని ఆమె ఆరోపించింది. మొత్తానికి… ఒకే ఇంటికి రెండు నెంబర్లు కేటాయించిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక మహిళ ఇల్లు కట్టుకోవడమే కాకుండా, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా పొందలేకపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.


