అర్హులందరికీ పారదర్శకంగా సదరం సర్టిఫికెట్లు
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో కలెక్టర్ అనుదీప్
కాకతీయ, ఖమ్మం : దివ్యాంగుల అభ్యున్నతికి పటిష్టమైన కార్యాచరణను అమలు చేస్తున్నామని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా నెలరోజులు ఆలస్యంగా దివ్యాంగుల దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని, అయినప్పటికీ దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమాల అమలులో ఖమ్మం జిల్లా యంత్రాంగం ఎప్పుడూ ముందంజలోనే ఉంటుందని కలెక్టర్ తెలిపారు. దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, జిల్లాలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన దివ్యాంగ జంటలకు ఈ ప్రోత్సాహకం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్కాలర్షిప్లు, దివ్యాంగులకు అవసరమైన పరికరాల పంపిణీలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
సదరం సర్టిఫికెట్ల జారీపై ప్రత్యేక నిఘా
అర్హులైన దివ్యాంగులందరికీ పారదర్శకంగా సదరం సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ర్యాండమ్గా తనిఖీ చేసి, అర్హులకు మాత్రమే సర్టిఫికెట్లు అందుతున్నాయా లేదా అన్నది పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంలో కంటి చూపు సమస్య కారణంగా బిడ్డను పాఠశాలకు పంపలేకపోతున్నారని వచ్చిన దరఖాస్తును ప్రస్తావిస్తూ, ఖమ్మం జిల్లాలో కంటి చూపు సమస్య ఉన్న పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే దాన్ని ప్రారంభిస్తామని కలెక్టర్ వెల్లడించారు. వీధి వ్యాపారాల్లో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు అన్ని మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ అమలు అయ్యేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి విజేత, డిప్యూటీ డీఎం అండ్ హెచ్వో డా. వేణుమాధవ్, డీహెచ్ఈడబ్ల్యూ సమ్రీన్, దివ్యాంగ సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, సంబంధిత అధికారులు, దివ్యాంగులు పాల్గొన్నారు.


